Share News

AP News: టీడీపీ-జనసేన-బీజేపీ దోస్తీపై నేడు అధికారిక ప్రకటన!

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:46 AM

తెలుగుదేశం - జన సేన - బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. శనివారం అధికారిక ప్రకటన చేయడమొక్కటే మిగిలింది. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు,

AP News: టీడీపీ-జనసేన-బీజేపీ దోస్తీపై నేడు అధికారిక ప్రకటన!

టీడీపీ-జనసేన-బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన!

బీజేపీ-జనసేనకు 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలు

సీట్ల సంఖ్యపై ఐదు నిమిషాల్లోనే నిర్ణయం

ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న అమిత్‌ షా

గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలన్న బీజేపీ

జగన్‌ పాలనకు తెర దించడమే ఉమ్మడి లక్ష్యం

23 ఎంపీ సీట్లు ఖాయమని బీజేపీ అంచనా

వైసీపీ పాలనపై కీలక వర్గాల నుంచి నివేదిక

అరాచక పాలనకు మద్దతివ్వకూడదని నిర్ణయం

ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా కార్యాచరణ

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం - జన సేన - బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. శనివారం అధికారిక ప్రకటన చేయడమొక్కటే మిగిలింది. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో తొలి ఐదు నిమిషాల్లోనే సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత... ఏపీలో పరిస్థితులు, పోరాట వ్యూహం, ‘కూటమి’ విజయం సాధించిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలపైనే చర్చ జరిగింది. ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసి... ఏపీలో జగన్‌ సాగిస్తున్న ఐదేళ్ల అరాచక పాలనకు అంతం పలకాలని మూడు పార్టీలు తీర్మానించుకున్నాయి. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ ఆంధ్ర ప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని నిర్ణయించాయి.

ఇదీ సీట్ల లెక్క...

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండి బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. జనసేన-బీజేపీ కలిసి 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయం గా తెలిసింది. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉంటారు. 8 ఎంపీ సీట్లలో 6, 30 అసెం బ్లీ సీట్లలో 6 నుంచి 8 బీజేపీకి కేటాయించేందుకు జనసేన సుముఖత వ్య క్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సొం తంగా 370 స్థానాల్లో, ఎన్డీయే కూటమి ద్వారా 400లకుపైగా సీట్లలో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు... ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ రీత్యా తమకు గౌరవప్రదమైన స్థాయిలో ఎంపీ సీట్లు కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు కోరినట్లు సమాచారం. దీంతో... ఉభయ కుశలోపరిలాగా తుది నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమైన తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘‘మాకు కేటాయించిన సీట్లన్నీ గెలిపించుకుంటాం. రాష్ట్రంలో మా కూటమి అధికారంలోకి వచ్చేందుకు శాయ శక్తులా కృషి చేస్తాం’’ అని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా కనీసం మూడు, నాలుగు సార్లు పర్యటించాలనుకున్నారని... ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్దికి అవసరమైన హామీలు ఇస్తారని కూడా బీజేపీ నేతలు చెప్పినట్లు తెలిసింది.

మీ బలం... మోదీ కరిష్మా!

‘‘మాకు ఆంధ్రప్రదేశ్‌లో తగినంత ఓట్ల బలం లేదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల జనంలో చెప్పుకోదగిన ఆదరణ ఉంది. దీనికి మీరు తోడైతే బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజల అభిమానం మరింత పెరుగుతుందని నమ్ముతున్నాం’’ అని బీజేపీ అగ్ర నేతలు చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. గత అయిదేళ్ల జగన్‌ పాలనలో అరాచకాలు కొనసాగాయని, రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనుకబడిన విషయం తమ దృష్టిలో ఉందని, తమ సర్వే ప్రకారం 25 లోక్‌సభ సీట్లలో కనీసం 23 సీట్లు తెలుగుదేశం-జనసేన-బీజేపీ గెలుచుకుంటుందని తేలిందని వారు చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు, అప్పుల పాలు చేస్తున్న వైనం తమకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. జగన్‌ తమకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ ఆయనను ప్రోత్సహించడం సరైందికాదని తాము భావిస్తున్నామని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పొత్తు కుదరకుండా చేసేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలు కూడా ఆయన పట్ల బీజేపీలో వ్యతిరేకత పెంచిందని తెలుస్తోంది. కాగా... తనకు రాష్ట్రాభివృద్ధి తప్ప మరేమీ ముఖ్యం కాదని, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం, నదుల అనుసంధానానికి వీలుగా పోలవరం వంటి బృహత్తర ప్రాజెక్టులను పూర్తి చేయడం, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడం తనకు ప్రధానమని చంద్రబాబు బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలిసింది.

ఇతర వర్గాల నుంచీ నివేదికలు..

ఏపీలో చంద్రబాబుతో స్నేహంపై ప్రముఖ సాంకేతిక నిపుణులు, సీనియర్‌ అధికారులు, సామాజికవేత్తల అభిప్రాయాలను కూడా బీజేపీ తెలుసుకున్నట్లు సమాచారం. ‘‘చంద్రబాబుకున్న విశ్వసనీయత, పేరు ప్రతిష్ఠల్లో వీస మాత్రం కూడా జగన్‌కు లేవు. జగన్‌ అరాచకవాది. మోదీ అభివృద్ధి అజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో చంద్రబాబు సహకారం ఎంతో తోడ్పడుతుంది’’ అని అధికార వర్గాలు కూడా నివేదించినట్లు సమాచారం. డిజిటల్‌ ఎకానమీ సాధించేందుకు నీతీ ఆయోగ్‌కు చంద్రబాబు ఇచ్చిన నివేదికను కూడా వారు ప్రస్తావించినట్లు సమాచారం.

Updated Date - Mar 09 , 2024 | 06:24 AM