తిరుపతి.. హాట్ హాట్!
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:20 AM
రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ సీటు హాట్ హాట్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ టికెట్ కోసం తొలుత స్థానిక నేత కిరణ్ రాయల్, హరిప్రసాద్
అసెంబ్లీ సీటుకు గట్టి పోటీ
జనసేన తరఫున రేసులో టీడీపీ నేత గంటా నరహరి
తాజాగా తెరపైకి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
బలమైన అభ్యర్థి కోసం పవన్ అన్వేషణ
అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ సీటు హాట్ హాట్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ టికెట్ కోసం తొలుత స్థానిక నేత కిరణ్ రాయల్, హరిప్రసాద్ ముందంజలో ఉన్నారు. అయితే వైసీపీ తరఫున ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి కొడుకు అభినయ్రెడ్డి బరిలో నిలవడంతో.. ఆయన్ను దీటుగా ఎదుర్కోగల.. అంగబలం, అర్థబలం ఉన్న అభ్యర్థి కోసం జనసేనాని పవన్ కల్యాణ్ అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ నేత గంటా నరహరి పేరుపై కసరత్తు జరుగుతోంది. ఆయన కూడా జనసేన సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెరపైకి వచ్చారు. పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఇస్తారని నిన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ గురువారం జనసేనలో చేరిన ఆయనకు.. సీటిచ్చే పరిస్థితి లేదని పవన్ స్పష్టత ఇచ్చారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసి ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఇద్దరు నేతలు గురువారం జనసేనానిని కలిశారు. వీరికి కూడా ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలు, ఇతర అంశాలపై వారితో చర్చించారు. తిరుపతిలో జనసేన గెలిచి తీరాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. బలమైన అభ్యర్థి ఎంపికకు రెండ్రోజుల క్రితం ప్రత్యేకంగా సర్వే కూడా నిర్వహించారు. ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, కాపు సంక్షేమ సంఘ నాయకులు, ప్రస్తుతం జనసేనలో క్రియాశీలంగా వారికి ఫోన్లు చేసి వారి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.