ఆరు నెలల్లో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:14 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్లోనూ భారీ స్కాంలకు పాల్పడ్డారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
వైసీపీ పాలనలో భారీ స్కాంలు : బాలకృష్ణ
హిందూపురం, జూలై 14: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్లోనూ భారీ స్కాంలకు పాల్పడ్డారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఆయన ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూపురం మండలం కొటిపి గ్రామ సమీపాన అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీటీడీ మొదలుకుని ఇసుక, మద్యంతోపాటు అన్నింటిలోనూ గత వైసీపీ పాలకులు దోపిడీ చేశారన్నారు. తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయన్నారు. తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి టిడ్కో ఇళ్ల పనులు 80శాతం పూర్తయ్యాయని, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని పాడుబెట్టిందని తెలిపారు. ఆరు నెలల్లో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.