Share News

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అతివేగం

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:44 AM

అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా ముసునూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ లారీని అతి వేగంగా కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అతివేగం

ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఢీకొన్న కారు

ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

కావలి రూరల్‌, ఏప్రిల్‌ 24: అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా ముసునూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ లారీని అతి వేగంగా కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కావలి రూరల్‌ పోలీసుల కథనం మేరకు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్‌కు చెందిన తిరునాతి సుబ్రహ్మణ్యం కుమార్తె కళ్యాణికి అదే ప్రాంతానికి చెందిన గోవిందరాజుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆ తరువాత రెండు నెలలకు భర్త నుంచివిడిపోయిన ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అదే సమయంలో ఎర్రాబత్తిన సిరి అలియాస్‌ రాజ్‌కుమార్‌ అనే ట్రాన్స్‌జెండర్‌తో కళ్యాణికి పరిచయం ఏర్పడింది. కాగా కొయ్యలగూడెంలో కళ్యాణికి ఫ్యాన్సీ షాపు ఉంది. అందులో విక్రయించేందుకు వన్‌గ్రామ్‌ గోల్డు ఆభరణాలు తెచ్చుకోవచ్చని రాజ్‌కుమార్‌తో పాటు వంగల కుమార్‌, అతని భార్య కుమారితో కలిసి కళ్యాణి కారులో సోమవారం రాత్రి చెన్నై వెళ్లారు. మంగళవారం రాత్రి చెన్నె నుంచి తిరిగి వస్తుండగా ముసునూరు టోల్‌గేట్‌ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో వారి కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటైనర్‌ లారీని అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్‌ లారీ కిందకు కారు దూసుకుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కళ్యాణి (21), రాజ్‌కుమార్‌ (30), వంగల కుమార్‌ (53) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే కావలి డీఎస్పీ వెంకటరమణ, రూరల్‌ సీఐ కాటూరి శ్రీనివాసరావు, టూ టౌన్‌ సీఐ కొండవీటి శ్రీనివాసరావు టోల్‌ప్లాజా మేనేజర్‌ గణేష్‌, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకుని తీవ్రగాయాలతో ఉన్న డ్రైవర్‌ షేక్‌ జిలానిని, కుమారిని క్రేన్‌ సాయంతో బయటకు తీసి 108 వాహనంలో నెల్లూరుకి తరలించారు. మృతదేహాలను కావలి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 03:44 AM