Share News

బెదిరించి ‘అసెంబ్లీ రౌడీ’ బోర్డులు!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:30 AM

రాష్ట్రంలో ఊరి ఊరిలో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా సీన్‌ ఆవిష్కృతమవుతోంది. ఎవరైనా విశ్వాసం కొద్దీ..

బెదిరించి ‘అసెంబ్లీ రౌడీ’ బోర్డులు!

ఇచ్ఛాపురం రూరల్‌, జనవరి 4: రాష్ట్రంలో ఊరి ఊరిలో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా సీన్‌ ఆవిష్కృతమవుతోంది. ఎవరైనా విశ్వాసం కొద్దీ... అభిమానం కొద్దీ తమ దైవాల పేర్లు... హీరోల పేర్లు... నాయకుల పేర్లను దుకాణాలు, ఇళ్లకు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో దుకాణాలకు, ఇళ్లకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టిడ్కో నివాసాలు, మంచినీళ్ల ట్యాంకులు, ప్రభుత్వ భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా తమ పార్టీ రంగులు వేసుకున్న వైసీపీ నాయకులు.. తాజాగా కొంతమంది ఇళ్లపైన, దుకాణాల వద్ద వారి పార్టీకి చెందిన బోర్డులు అమర్చుతున్నారు. సంక్షేమ పథకాల ఆశ చూపించి... వాటికీ లొంగని వారిని బెదిరించి ఈ బోర్డులు పెట్టిస్తున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని కొందరు దుకాణదారులు, ఇళ్ల యజమానులను దీనిపై ప్రశ్నించగా... జగన్‌ సైన్‌ బోర్డులు పెట్టుకోకుంటే... సంక్షేమ పథకాలు రద్దవుతాయని చెప్పడంతో చేసేదిలేక వాటిని ఏర్పాటు చేసుకున్నామని వాపోయారు.

అవాక్కయ్యేలా ముగ్గు!

మామూలుగా అయితే ఈ బొమ్మ... ఈ నినాదాల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే, ఈ ముగ్గు వేసిన ప్రాంతం వల్ల దీనికి ప్రాముఖ్యత వచ్చింది. సంక్రాంతి సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బాలిక వేసిన ముగ్గు ఇది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలో గురువారం నిర్వహించిన ఈ పోటీల్లో ఒక అమ్మాయి.. జనసేన లోగోను ముగ్గుగావేసింది. ముగ్గుతో పాటు ‘వైసీపీ వద్దు... జనసేన ముద్దు’ అని రాసింది. ఈ ముగ్గును చూసి నిర్వాహకులు అవాక్కయ్యారు.

- రాజుపాలెం

Updated Date - Jan 05 , 2024 | 07:04 AM