Share News

పెంచిన వారే గొంతుకోసి చంపేశారు!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:25 AM

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే...కానీ, ఆస్తి వ్యామోహం అతన్ని క్రూరుణ్ణి చేసింది...భార్య సహకరించింది. ఫలితం దత్తత పుత్రికను దంపతులు దారుణంగా హత్యచేశారు.

పెంచిన వారే గొంతుకోసి చంపేశారు!

ఆస్తిని తిరిగి దక్కించుకునేందుకు ఘాతుకం

ప్రకాశం జిల్లా బాలిక హత్య కేసులో పురోగతి

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే...కానీ, ఆస్తి వ్యామోహం అతన్ని క్రూరుణ్ణి చేసింది...భార్య సహకరించింది. ఫలితం దత్తత పుత్రికను దంపతులు దారుణంగా హత్యచేశారు. నిందితుడైన ఆ ఉపాధ్యాయుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని భారీ మొత్తంలో బెట్టింగ్‌లు కట్టి నష్టపోయినట్టు కూడా సమాచారం.

కంభం, జూన్‌ 7 : ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తొమ్మిదేళ్ల బాలిక శాన్విరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. పెంపుడు తల్లిదండ్రులే అత్యంత క్రూరంగా ఆ చిన్నారి గొంతుకోసి చంపారని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. మండల కేంద్రమైన అర్థవీడులో గురువారం పట్టపగలు ఇంట్లోనే శాన్విరెడ్డి (9) హత్యకు గురైన విషయం విదితమే. పోలీసుల విచారణలో శాన్విరెడ్డిని పెంపుడు తండ్రి రమణారెడ్డి సమక్షంలోనే పెంపుడు తల్లి పద్మావతి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారని సమాచారం. రాచర్లకు చెందిన రమణారెడ్డి, రంగారెడ్డిలు సోదరులు. రమణారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అర్ధవీడులో స్థిరపడ్డారు. రంగారెడ్డి వృత్తిరీత్యా ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌లో ఉంటున్నారు. రమణారెడ్డికి పిల్లలు లేకపోవడంతో తమ్ముడి కుమార్తె శాన్విరెడ్డి(9)ని ఎనిమిదేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. అప్పట్లోనే తమ ఆస్తిని శాన్విరెడ్డి పేరిట రాసినట్టు సమాచారం. అయితే శాన్విరెడ్డి పెరుగుతున్న కొద్దీ అసలు తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుందన్న అభద్రతాభావం రమణారెడ్డి దంపతుల్లో ఏర్పడింది. పైగా రమణారెడ్డి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భారీ మొత్తంలో బెట్టింగ్‌లు పెట్టి నష్టపోయాడు. దీంతో దత్తపుత్రిక పేరిట రాసిన ఆస్తిని తిరిగి చేజిక్కించుకోవాలని భావించారు. ఈనేపథ్యంలోనే శాన్విరెడ్డిని అసలు తల్లి రెండు రోజు లు తమ ఇంటికి తీసుకెళ్లింది. తిరిగి తెచ్చుకునేందుకు పద్మావతి డోన్‌ వెళ్లగా రెండు రోజులు ఉండి వస్తుందిలే అని చెప్పింది. దీంతో శాన్విరెడ్డి ఎప్పటికైనా కన్న తల్లిదండ్రుల ఇంటికే వెళ్లిపోతుందని పద్మావతి కక్ష పెంచుకొంది. ఐదు రోజుల క్రితం శాన్విరెడ్డిని అర్ధవీడు తీసుకువచ్చారు. గురువారం ఉదయం పదునైన కత్తితో పద్మావతి శాన్విరెడ్డి గొంతు కోసి హత్య చేసింది. ఇదంతా రమణరెడ్డి చూస్తూ ఉన్నట్టు సమాచారం. పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది.

Updated Date - Jun 08 , 2024 | 07:45 AM