భావితరాల కోసం ధర్మయుద్ధమిది
ABN , Publish Date - Mar 03 , 2024 | 03:32 AM
వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. అది నా కోసం కాదు. పవన్ కల్యాణ్ కోసం కాదు.
జగన్ను చిత్తు చేయడానికి ‘సిద్ధం’ కావాలి
సాధారణంగా చేరికలు హైదరాబాద్ లేదా అమరావతిలో జరుగుతాయి. కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తి. అటువంటివారిని పార్టీలోకి ఆహ్వానించడం నా బాధ్యతగా భావించి నెల్లూరుకు వచ్చా. విలువలు కలిగిన నేతలు వైసీపీని వీడుతున్నారు. ఇది చూసి జగన్ అండ్ కోకు పిచ్చి పట్టింది. ఏం చేయాలో అర్థంకాక రోజుకో అభ్యర్థిని మార్చేస్తున్నారు. - నెల్లూరు సభలో చంద్రబాబు
విలువలు ఉన్న నేతలంతా వైసీపీని వీడుతున్నారు
వేమిరెడ్డిని గౌరవించడం కోసమే నెల్లూరు వచ్చా
ఫ్లెక్సీలు మార్చినట్టు ఇన్చార్జుల్ని మార్చుతున్న జగన్
ప్రజలారా.. గత పొరపాటు పునరావృతం కావొద్దు
అలా జరిగితే ఈసారి రాష్ట్రం ఉనికి మాయం: బాబు
వందలాది మందితో వీపీఆర్ దంపతులు పార్టీలోకి
నెల్లూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. అది నా కోసం కాదు. పవన్ కల్యాణ్ కోసం కాదు. రాష్ట్ర ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. అందరూ ధర్మయుద్ధానికి సిద్ధం కండి’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి పొరబాటు జరిగితే రాష్ట్రానికి ఉనికి ఉండదని, ఒక్కసారి ముద్దులకు ఏమారినందుకు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డితోపాటు ఆయన అనుచరులు, అభిమానులు టీడీపీలో చేరిక సందర్భంగా శనివారం చంద్రబాబు నెల్లూరు వచ్చారు. ‘వీపీఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని గౌరవించడం నా బాధ్యతగా భావించి నెల్లూరుకు వచ్చాను’’ అని చంద్రబాబు అన్నారు. ఫ్లెక్సీలు మార్చినంత తేలిగ్గా అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
జగన్ ‘సిద్ధం’ అంటే అభ్యర్థులు పరార్
‘‘జగన్ ‘సిద్ధం’ అంటే అభ్యర్థులు పారిపోతున్నారు. ఇప్పటికి ఆరుగురు ఎంపీలు వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. నెల్లూరులో ఒక నాయకుడు (అనిల్కుమార్ యాదవ్) ‘బుల్లెట్ దిగిందా లేదా..!’ అనేవాడు. పాపం ఆయనను ఒక తన్ను తంతే మూడు జిల్లాల అవతల పడ్డాడు. అక్కడ ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ తంతే నేరుగా చెన్నై లో పడిపోతాడు. ఐదు నుంచి ఆరుమంది ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైసీపీకి రాజీనామా చేశారు. మంచి వాళ్లంతా టీడీపీలో కి వచ్చేస్తున్నారు. ఇది చూసి జగన్కు పిచ్చిపడుతోంది. తాడేపల్లి ప్యాలె్సకు వణుకు పుడుతోంది’’
చెల్లెళ్ల ప్రశ్నలపై జవాబుకు సిద్ధమా?
‘‘జగన్ ఊరికే సిద్ధం.. సిద్ధం అని అరుస్తున్నారు. నిన్న ఆయన సోదరి ఒకమాట అడిగింది. హంతకులకు పరిపాలించే అర్హత లేదు అంది. ‘సిద్ధం’ అంటున్న జగన్ దీనికి జవాబివ్వాలి. ‘ఏ కేసులైనా నాలుగు, ఐదు రోజుల్లో తేలిపోతాయి. కానీ వివేకా కేసు ఎందుకు ఐదేళ్లయినా తేలలేదు’ అని ఆమె అడిగారు. సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా..!? బాబాయ్ హత్య కేసులో సమాధానం చెప్పడానికి సిద్ధమా!? హూ కిల్డ్ బాబాయ్? సమాధానానికి సిద్ధమా? మరో చెల్లెలు షర్మిళ. పాపం ఆమెకు ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు. ఆమె అడుగుతున్న దానిపై సమాధానం ఇవ్వడానికి సిద్ధమా?! చివరికి సామాజిక మాధ్యమాల్లో ఆమె పుట్టుక గురించి కూడా నీచంగా పోస్టింగులు పెట్టించాడు. ‘నిన్ను మనిషి అంటారా జగన్. ఇది నీ తల్లికి, నీ చెల్లికి అవమానం కాదా!? దీనిపై ఎందుకు స్పందించలేదు? జగన్ ‘సిద్ధం’ అంటే అందరనీ అరెస్టు చేసి ఆ తరువాత సిద్ధం సభకు బయలుదేరుతారు. అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా సంఘాలు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇలా అందరినీ అరెస్టులు చేసిన తరువాత కానీ జగన్ సిద్ధం సభకు బయలుదేరడు’’
ఎవరికీ ఇవ్వనంత గౌరవం పవన్కు ఇస్తున్నా!
‘‘జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. కులాల మధ్య చిచ్చుపెట్టాడు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇప్పుడు నాకు, పవన్కు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరికి ఇవ్వనంత గౌర వం పవన్కు ఇస్తున్నా. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టీడీపీ, జనసేనలకు చెందిన ఒక్క ఓటు కూడా మరో పార్టీకి బదిలీ కాకూడదనే ఉద్దేశంతో నేను, పవన్ జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాం’’
భారీగా చేరికలు.. మధ్యాహ్నం 12.45 గంటలకు సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకున్నారు. తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వందలాదిగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, వారి అనుచరులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సభ ఆరంభంలోనే వేమిరెడ్డి దంపతులకు కండువాలు కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభ అనంతరం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలు ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన వీపీఆర్ అభిమానులు, స్థానిక వైసీపీ నాయకులను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
ఊరూరా చీలిన వైసీపీ ఓటు!
వీపీఆర్ రాజీనామాను తేలిగ్గా తీసుకున్న వైసీపీ అధిష్ఠానం అందుకు తగిన మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీపీఆర్ వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా మొత్తం 11 నియోజకవర్గాల నుంచి వందల సంఖ్యలో స్థాయి కలిగిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు మాట్లాడుతూ... ఈ చేరికలను చూస్తుంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోయినట్లుగానే ఉందని వ్యాఖ్యానించారు. వీపీఆర్ వెంట టీడీపీలో చేరిన నాయకులందరూ మండల, గ్రామ స్థాయుల్లో పట్టు కలిగిన వారే. వీరి చేరికతో ఊరూరా వైసీపీ ఓటు బ్యాంకు చీలినట్టు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.