ఆస్పరి బైపాస్లో దొంగల హల్చల్
ABN , Publish Date - May 25 , 2024 | 11:33 PM
పట్టణంలోని అస్పరి బైపాస్లో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు.
![ఆస్పరి బైపాస్లో దొంగల హల్చల్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదోని, మే 25: పట్టణంలోని అస్పరి బైపాస్లో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. షాపులకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. ముందుగా శ్రీకృష్ణ బేకరీలోకి అర్ధరాత్రి వేళలో దొంగలు బెకరీ వెనకవైపు నుంచి లోపలకు దూరారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పగలగొట్టారు. బేకరీలో ఉన్న రూ.10 వేల విలువ చేసే తినుబండారాలు, కొంత నగదును తీసుకుని పక్కనే ఉన్న టీ బేకరీలోకి అడ్డుగా ఉన్న రేకులు కట్ చేసి లోపలికి దూరారు. టీ బేకరీలో రూ.పదివేల విలువచేసే సిగరెట్లు, బిస్కెట్స్ దొంగలించారు. ప్రధానంగా సీసీ కెమెరాలు దొరక్కుండా ముందు జాగ్రత్తగా మొహాలకు మంకీ క్యాప్లు ధరించి రావడం విశేషం. అక్కడే పక్కన ఉన్న నెల్లూరు మెస్సులోకి రేకును కట్ చేసి లోపలకు దూరారు. అక్కడ కూడా చిల్లర వస్తువులు మాత్రమే దొంగలించారు. పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి రేకును కట్ చేసి, లోపల దూరి, చిన్నపాటి వస్తువులను దొంగలించుకెళ్లారు. ఈ ఐదు దుకాణాల్లో కూడా నగదును ఉంచకపోవడంతో చిన్నపాటి వస్తువులే చోరీకి గురైనట్లు గుర్తించారు. అదే రోడ్లో ఉన్న ఏటీఎం సెంటర్లోకి దొంగలు వెళ్లకపోవడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడడంతో... ముందస్తు ప్రకారంగా రిక్కీ నిర్వహించి, దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి, సిద్దేశ్, గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.