మెడలు వంచుతానని మోకరిల్లారు
ABN , Publish Date - Mar 22 , 2024 | 03:29 AM
విభజన జరిగి పదేళ్లయినా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
![మెడలు వంచుతానని మోకరిల్లారు](https://media.andhrajyothy.com/media/2024/20240313/cc_69433de01e.jpg)
బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన జగన్
ఇండియా కూటమి సభలో షర్మిల ధ్వజం
బీజేపీని, దానికి సహకరిస్తున్న పార్టీలనూ ఓడిద్దాం
సీపీఎం, సీపీఐ నేతల పిలుపు
విజయవాడ/గవర్నరుపేట, మార్చి 21(ఆంధ్రజ్యోతి): విభజన జరిగి పదేళ్లయినా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఐక్యవేదిక సదస్సు విజయవాడలోని బాలోత్సవ్ భవనంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ చివరికి బీజేపీకి మోకరిల్లారని విమర్శించారు. ‘రాష్ట్రంలో గంగవరం పోర్టును అదానికి కట్టబెట్టారు. బీజేపీ ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా జగన్ ఉన్నారు. బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏంచేసిందో అధికార, ప్రతిపక్షాలు చెప్పగలవా?. బీజేపీకి కొమ్ముకాస్తున్న పక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబు తెలుగు ప్రజల పౌరుషాన్ని మోదీ పాదాల వద్ద తాకట్టు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. మత రాజకీయాల ద్వారా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీ బెదిరిస్తోందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.