దాడిశెట్టి రాజాపై 20 కేసులున్నాయి
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:26 AM
‘ఆంధ్రజ్యోతి’ విలేకరి సత్యనారాయణ హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) హైకోర్టును ఆశ్రయించారు.
హత్య కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దు
హైకోర్టులో సీనియర్ న్యాయవాది పోసాని
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి సత్యనారాయణ హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నవంబరు 5న నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి ముందు ఇంప్లీడ్ పిటిషన్ వేసిన మృతుడి సోదరుడు కె. గోపాలకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ‘పిటిషనర్ను కేసులో నిందితుడిగా చేరుస్తూ 2019, అక్టోబరు 15న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2023లో చార్జిషీట్ దాఖలు చేసినా, దానిలో రాజా పేరు తొలగించారు. పిటిషనర్కు పూర్వ నేరచరిత్ర ఉంది. ఆయనపై 20కి పైగా కేసులున్నాయి. ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడు’ అని విన్నవించారు. దాడిశెట్టి రాజా తరఫున సీనియర్ న్యాయవాది ఒ. మనోహర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘పోలీసులు పిటిషనర్ను అరె స్టు చేస్తారనే ఆందోళన ఉంది. ముందస్తు బెయిల్ మంజూ రు చేయండి’’ అని కోరారు.