బాలుడిని బలిగొన్న వైసీపీ ప్రచార రథం
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:30 AM
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తలే రాజేష్ ప్రచార రథం ఓ బాలుడి ఉసురు తీసింది. రాజాంలోని చీపురుపల్లి రోడ్లో గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాజాంలోని
సకాలంలో రాని 108.. అదే వాహనంలో ఆస్పత్రికి తరలింపు
చికిత్స పొందుతూ బాలుడి మృతి.. రాజాంలో ఘటన
రాజాం రూరల్, ఏప్రిల్ 18: విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తలే రాజేష్ ప్రచార రథం ఓ బాలుడి ఉసురు తీసింది. రాజాంలోని చీపురుపల్లి రోడ్లో గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాజాంలోని లచ్చయ్యపేటకు చెందిన కె.వెంకటేష్, సంతోషిల కుమారుడు భరద్వాజ్(10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. టిఫిన్ కోసం గురువారం సాయంత్రం 7.30 గంటలకు మెయిన్ రోడ్డుపైకి వచ్చాడు. అంతలోనే వైసీపీ ప్రచార వాహనం వేగంగా వచ్చి బాలుడ్ని ఢీకొంది. అతడిపై నుంచి వాహనం వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో డ్రైవర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అది సకాలంలో రాకపోవడంతో మరొక డ్రైవర్ సహాయంతో బాలుడ్ని ఢీకొన్న వాహనంలోనే రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరద్వాజ్ రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతి చెందాడు. వైసీపీ అభ్యర్థి రాజేష్ ఆసుపత్రి వద్దకు రావాలని, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.