1.55 గంటల్లో 4.50 లక్షల టికెట్ల కోటా పూర్తి
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:42 AM
తిరుమల శ్రీవారి జూలై నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా కేవలం గంటా యాభై ఐదు నిమిషాల్లో పూర్తయిపోయింది.
తిరుమల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి జూలై నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా కేవలం గంటా యాభై ఐదు నిమిషాల్లో పూర్తయిపోయింది. బుధవారం ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన 4.50 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను స్లాట్ల వారీగా విడుదల చేసింది. ఈ టికెట్లను భక్తులు 1.55 గంటల్లో తమకు కావాల్సిన తేదీలు, స్లాట్లలో బుక్ చేసుకున్నారు. ఇక, 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేసిన అంగప్రదక్షిణ టోకెన్లు 4 నిమిషాల్లో, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసిన వృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు 20 నిమిషాల్లో పూర్తయ్యాయి. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, ఒంటి గంటకు పరకామణి సేవలను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.