Share News

అత్తగారింటికి వెళ్తూ.. నవదంపతుల మృతి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:20 PM

మండలంలోని రాఘవరాజపురం గ్రామం ప్రధానదారిలో శుక్రవారం బోరు పైపులను తీసుకెళ్తున్న లారీ ఆటోను ఢీ కొనడంతో నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

అత్తగారింటికి వెళ్తూ.. నవదంపతుల మృతి
మృతిచెందిన భార్గవ్‌, లక్ష్మీదేవి (ఫైల్‌)

ఆటోను ఢీకొన్న లారీ

కాళ్ల పారాణి ఆరకముందే మృత్యుఒడిలోకి

ఆరు నెలల కిందటే వివాహం

పండగ పూట విషాదం

సంక్రాంతికి నవదంపతులు ఊరెళదామనుకున్నారు. అందుకు కావాల్సిన నూతన దుస్తులు, తదితరవి కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు. వివాహమైన తర్వాత మొదటి పండక్కి తన అమ్మగారింటికి వెళ్తున్నామన్న సంతోషంలో ఆ వధువు ఉబ్బితబ్బిబ్బయింది. కానీ ఇంతలోనే వారిని విధి వక్రీకరించింది. కాళ్ల పారాణి ఆరకముందే మృత్యుఒడికి చేర్చింది. ఆటోలో వెళ్తున్న వీరిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. వివాహమై ఆరు నెలలు కాకముందే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరై విలపించారు. ఎటువంటి అచ్చటా.. ముచ్చటా.. తీరకముందే ఇలా జరిగిందేమిటి దేవుడా అని గుండెలు పగిలేలా ఏడ్చారు.

రైల్వేకోడూరు, జనవరి 12: మండలంలోని రాఘవరాజపురం గ్రామం ప్రధానదారిలో శుక్రవారం బోరు పైపులను తీసుకెళ్తున్న లారీ ఆటోను ఢీ కొనడంతో నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పెనగలూరు మండలంలోని వెలగచర్ల దళితవాడ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్‌ (24)తో రాజంపేటకు చెందిన లక్ష్మీదేవి (28)కి 5 నెలల కిందట వివాహమైంది. వీరు ప్రస్తుతం రైల్వేకోడూరులో నివాసం ఉంటున్నారు. భార్గవ్‌ ఒక పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ, ఖాళీ సమయంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వేకోడూరు నుంచి భార్గవ్‌ తన సొంత ఆటోలో ఫ్రిజ్‌, తదితర సామాన్లు తీసుకుని రాజంపేటలోని తన అత్త ఇంటికి భార్యతో సహా పండుగకు వెళ్తుండగా రాఘవరాజపురం ప్రధానదారిలో రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు బోరు పైపుల లోడుతో వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటో నుజ్జునుజ్జయి ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ-1 డాక్టర్‌ నాయక్‌లు తమ సిబ్బందితో వచ్చి మృతదేహాలను పరిశీలించారు. వెంటనే శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు హుటాహుటిన రాఘవరాజపురానికి చేరుకున్నారు. ఎటువంటి అచ్చటా.. ముచ్చటా.. తీరకుండానే ఇలా జరిగిందేంటి అని బోరున విలపించారు. భార్గవ్‌ తల్లి లక్ష్మీదేవి దుఖఃసాగరంలో మునిగిపోయింది. పెనగలూరు మండలంలోని వెలగచర్ల దళితవాడ, రాజంపేట మండలంలోని బలిజపల్లెలో పండుగపూట విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Updated Date - Jan 12 , 2024 | 11:20 PM