జగన్ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు
ABN , Publish Date - Apr 26 , 2024 | 05:41 AM
గత ఐదేళ్లూ పరిమితిని మించి అప్పులు చేసిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టి, ప్రజల నెత్తిన అప్పుల కుంపటి పెట్టేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు.
ప్రజల నెత్తిన అప్పుల కుంపటి: నీలాయపాలెం
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లూ పరిమితిని మించి అప్పులు చేసిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టి, ప్రజల నెత్తిన అప్పుల కుంపటి పెట్టేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. వృద్ధి, అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ప్రజలే భారం మోయాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ఐదేళ్లూ విచ్చలవిడిగా అప్పులు చేసి, అభివృద్ధిని విస్మరించిన జగన్... చివరి రెండు నెలల్లో సాధ్యమైంత బొక్కడానికి మళ్లీ అప్పులు చేస్తున్నాడు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై జగన్ కాకిలెక్కలు చెబుతూ, కేంద్రాన్ని మోసం చేసి, ఈరెండు నెలల్లో పరిమితిని మించి, ఆర్బీఐ నుంచి రూ.94 వేల కోట్ల అప్పు చేశాడు. అప్పులు చేయకుంటే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చాడు. ఎంత ఆదాయం ఉంటే అంత అప్పు చేస్తున్నాడు. అప్పు చేస్తే కానీ పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు’ అంటూ లెక్కలతో సహా వివరించారు. అప్పులు చేసినా, జగతి పబ్లికేషన్ తప్ప రాష్ట్రం ఏమాత్రం వృద్ధి సాధించలేదన్నారు. ఎన్నికల్లో అయాచితంగా లబ్ధి పొందాలని చూస్తున్న జగన్ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని విజయకుమార్ స్పష్టం చేశారు.