Share News

‘రాజధాని’లో అసైన్డ్‌ రైతుల ఆర్తనాదాలు!

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:43 AM

ప్రభుత్వం మారింది.. కూటమి అధికారంలోకి వచ్చింది.. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. రాజధానికి మంచిరోజులొచ్చాయి..

‘రాజధాని’లో అసైన్డ్‌ రైతుల ఆర్తనాదాలు!

మూడేళ్లుగా కౌలు సొమ్ము అందక ఆకలి కేకలు

గత ప్రభుత్వంలో కక్షపూరితంగా సీఐడీ కేసులు

కూటమి ప్రభుత్వంలోనూ మారని తలరాత

రైతులపట్ల అవమానకరంగా సీఆర్డీఏ తీరు

నీటి మూటగా స్థానిక ఎమ్మెల్యే హామీ

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం మారింది.. కూటమి అధికారంలోకి వచ్చింది.. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. రాజధానికి మంచిరోజులొచ్చాయి.. తద్వారా రైతుల తలరాతలు మారబోతున్నాయి.. ఐదేళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి.. ఇదంతా నాణానికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా.. అసైన్డ్‌ రైతుల తలరాతలు మాత్రం మారలేదు. వైసీపీ పాలనలో మొదలైన వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ ఆగలేదు. మరోవైపు గోడు చెప్పుకుందామని వెళ్లిన తమను సీఆర్డీఏ అధికారులు హీనంగా చూస్తూ అవమానిస్తున్నారని వాపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలూ అమలుకు నోచక విలవిల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబే తమ గోడు వినిపించుకోవాలని వేడుకుంటున్నారు.

అసైన్డ్‌ రైతుల భాగస్వామ్యం తక్కువేమీ కాదు..

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో అసైన్డ్‌ రైతుల భాగస్వామ్యం తక్కువేమీ కాదు. 3,139 మంది అసైన్డ్‌ రైతులు 2,689.14 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వారిపై ఒత్తిడి తెచ్చినా.. వారు మాత్రం ప్రభుత్వం మాటలను విశ్వసించి భూములిచ్చారు. దీంతో కక్ష పెంచుకున్న వైసీపీ.. అధికారం చేపట్టిన వెంటనే ఆ రైతులపై సీఐడీ కేసులు పెట్టింది. ఆ భూములపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకూ ఫారం- 9.14 కింద ఏడేళ్లపాటు వారికి ఇచ్చిన కౌలును, సీఐడీ విచారణ సాకుతో ఆపేసింది. సీఐడీ విచారణ పేరుతో ఆ భూములను నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలో పెట్టి మూడేళ్లుగా వారికి కౌలు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు కొంత మందిని ఆ జాబితా నుంచి తప్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమ కష్టాలు పోతాయని భావించిన ఆ రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇప్పటికీ వెయ్యి కుంటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలోనే ఉంది. దీంతో వారికి కౌలు రావడంలేదు. వైసీపీ ప్రభు త్వం కక్షపూరితంగా పెట్టిన సీఐడీ కేసులనే సాకుగా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించినా, అసైన్ట్‌ రైతుల కౌలు మాత్రం చెల్లించలేదు. దీంతో వారు ఆవేదనకు గురవుతున్నారు.

అవమానకరంగా అధికారుల తీరు

మరోవైపు ప్రభుత్వం మారినా సీఆర్డీఏ అధికారుల తీరు మారలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే నేటికీ అవమానాలే ఎదురవుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి కంటే అత్యంత అమానవీయంగా అధికారుల తీరు ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తూ సీఆర్డీఏ అదనపు కమిషనరే తమను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆక్రోశిస్తున్నారు. ఇక, అసైన్డ్‌ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రస్తుత తాడికొండ ఎమ్మెల్యే వారికి ఇటీవల హామీ ఇచ్చినా.. ఆచరణ లేదు. దీనిపై రైతులు ఆయనను మరోమారు ప్రశ్నించగా.. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్‌ను కలవండని ఉచిత సలహా ఇచ్చినట్లు అసైన్డ్‌ రైతులు చెబుతున్నారు. దీంతో అసైన్డ్‌ రైతులు సీఎం చంద్రబాబే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Oct 04 , 2024 | 03:43 AM