Share News

2019లో టెన్త్‌.. ఇప్పుడు పీహెచ్‌డీ!!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:11 AM

విశాఖపట్నం ఎంపీ, ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ తన విద్యార్హతలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

 2019లో టెన్త్‌.. ఇప్పుడు పీహెచ్‌డీ!!

వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సిత్రాలు.. నామినేషన్‌పై టీడీపీ అభ్యంతరం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎంపీ, ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ తన విద్యార్హతలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గత 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు తాను పదో తరగతి మాత్రమే చదివినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ, ఐదేళ్లు గడిచేసరికి ఆయన పీహెచ్‌డీ చేస్తున్నారట. తాజాగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో 2022లో పీజీ పూర్తిచేసి, ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ విషయంపై టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు తరఫున ఎన్నికల ఏజెంట్‌ సీహెచ్‌ పట్టాభి అభ్యంతరం లేవనెత్తారు. ఈ విద్యార్హతలు నమ్మశక్యంగా లేవని, నామినేషన్‌ తిరస్కరించాలని కోరారు. కానీ, ఇది పెద్ద విషయం కాదన్న రిటర్నింగ్‌ అధికారి.. ఎంవీవీ నామినేషన్‌ను ఆమోదించారు.

Updated Date - Apr 27 , 2024 | 08:08 AM