Share News

తెలుగుదేశం వాళ్లకు నీళ్లు ఇవ్వం

ABN , Publish Date - May 25 , 2024 | 03:58 AM

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం హెచ్‌ఎస్‌ తండాలో టీడీపీ మద్దతుదారులకు తాగునీళ్లు ఇచ్చేందుకు వైసీపీ మూకలు నిరాకరించాయి.

తెలుగుదేశం వాళ్లకు నీళ్లు ఇవ్వం

దిక్కున్నచోట చెప్పుకోండి.. అనంతలో వైసీపీ మూకల ఆగడం

టీడీపీ కార్యకర్తల ఇళ్లపై కర్రలతో దాడి

ఆరుగురికి తీవ్ర గాయాలు.. బళ్లారిలో చికిత్స

డి.హీరేహాళ్‌, మే 24: అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం హెచ్‌ఎస్‌ తండాలో టీడీపీ మద్దతుదారులకు తాగునీళ్లు ఇచ్చేందుకు వైసీపీ మూకలు నిరాకరించాయి. గట్టిగా నిలదీసినందుకు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం, హెచ్‌ఎస్‌ తండాలో పంచాయతీ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను వైసీపీ నాయకుడు శివనాయక్‌, ఆయన భార్య శకుంతల రూపాబాయి నిర్వహిస్తున్నారు. తండాలోని టీడీపీ మద్దతుదారు దేవిబాయి గురువారం ప్లాంట్‌ వద్దకు వెళ్లి నీటి కోసం డబ్బు ఇవ్వబోగా, తీసుకోలేదు. నీరు ఇచ్చేది లేదని శకుంతల తెలిపారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఇతరులకు మాత్రం నీటిని వదిలారు. దీనిపై దేవిబాయి నిలదీయగా, ‘టీడీపీ వారికి నీళ్లు ఇచ్చేది లేదు. దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ శకుంతల గొడవకు దిగారు. దేవిబాయిని కొట్టారు. పోలీసులు ఇరువర్గాలను డి.హీరేహాళ్‌ పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి మందలించి పంపించారు. తండాకు వెళ్లాక టీడీపీ వర్గీయులపై గురువారం రాత్రి వైసీపీ వర్గీయులు శివనాయక్‌, లోకేశ్‌నాయక్‌, ఎసుంది నాయక్‌ తదితరులు కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో గవిసిద్ధనాయక్‌, దేవిబాయి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకునేందుకు వెళ్లినవారిపైనా వైసీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో మరో నలుగురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 03:58 AM