Share News

AP News: జగన్ పాలన ఎలా ఉందనే దానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉండదు..

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:44 AM

ఈ ఫొటోల్లో ఉన్న రోడ్లను చూశారా..! ఒకవైపు చిన్న గతుకన్నదీ లేకుండా 4 లేన్ల రహదారి అద్దంలా మెరిసిపోతోంది. మరోవైపు తారు కొట్టుకుపోయి పెద్ద గొయ్యిలా తయారైంది.

AP News: జగన్ పాలన ఎలా ఉందనే దానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉండదు..

ఒకటే రోడ్డు.. అటు అలా ఇటు ఇలా

భద్రాచలం-పర్ణశాల మార్గంలో రెండు

రాష్ట్రాల అనుసంధాన రోడ్డు దుస్థితి ఇదీ

మరమ్మతునూ పట్టించుకోని జగన్‌ సర్కారు

అల్లూరి జిల్లాలో దారంతా గుంతలమయం

ఈ ఫొటోల్లో ఉన్న రోడ్లను చూశారా..! ఒకవైపు చిన్న గతుకన్నదీ లేకుండా 4 లేన్ల రహదారి అద్దంలా మెరిసిపోతోంది. మరోవైపు తారు కొట్టుకుపోయి పెద్ద గొయ్యిలా తయారైంది. తెలంగాణ, ఆంధ్రాను అనుసంధానం చేసే రోడ్డు ఇది. తెలంగాణలో ఎంతో నాణ్యతగా, ఏపీలో చాలా అధ్వానంగా ఉంది. తెలంగాణలో భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే మార్గంలో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలంలో 9 కి.మీ. ప్రయాణించాలి. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చి, మళ్లీ తెలంగాణలోకి వెళ్లాలి. జగన్‌ సర్కారు వచ్చాక ఏపీ పరిధిలోని రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో దారుణంగా తయారైంది. ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కార్లు, బస్సులు, వ్యాన్లలో భద్రాచలం నుంచి పర్ణశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. తెలంగాణలో రోడ్డు జీబ్రాలైన్స్‌తో రాకపోకలకు సౌలభ్యంగా ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి రాగానే వాహనదారులు వామ్మో అంటూ హడలిపోతున్నారు. రాత్రిపూట వాహనాలు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నాయి. రాష్ట్ర విభజనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం మండలం యటపాక, పిచుకులపాడు, కన్నాయిగూడెం పంచాయతీలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. అలాగే భద్రాచలం-పర్ణశాల మార్గంలో రాజుపేట నుంచి తూరుబాక వరకు 9 కి.మీ. ఆర్‌అండ్‌బీ రహదారి ఆంధ్రాలోకి వెళ్లింది. తెలంగాణలో రోడ్డుకు ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు, బీటీ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆంధ్రాలోని రోడ్డుకు మరమ్మతుల గురించి పట్టించుకునేవారే లేరు. కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించడానికి వాహనదారులు నరకం చూస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణతో పాటు ఛత్తీ్‌సగఢ్‌ నుంచి భక్తులు, పర్యాటకులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతూ, అడ్డగోలుగా అప్పులు చేస్తున్నా కనీసం రోడ్డు మరమ్మతు పనులు కూడా చేయించడం లేదు.

Updated Date - Mar 09 , 2024 | 10:57 AM