Share News

AP News: నేడు టీడీపీ రెండో జాబితా!.. ఆశావహుల్లో ఉత్కంఠ!

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:09 AM

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ గురువారం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారమిక్కడ ధ్రువీకరించారు. అందులో సుమారు పాతిక మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా

AP News: నేడు టీడీపీ రెండో జాబితా!.. ఆశావహుల్లో ఉత్కంఠ!

25 అసెంబ్లీ, 10 లోక్‌సభ పేర్లు ప్రకటించే చాన్స్‌

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ గురువారం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారమిక్కడ ధ్రువీకరించారు. అందులో సుమారు పాతిక మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని తెలిసింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 31 స్థానాలను కేటాయించిన ఆ పార్టీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు.. టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు బుధవారమిక్కడ చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన వియ్యంకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు టీడీపీ అధినేతను కలిశారు. గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా చంద్రబాబును కలిసి.. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు చెబుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, బద్వేలు(ఎస్సీ) ఇన్‌చార్జి రితేశ్‌ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు మాట్లాడారు. జమ్మలమడుగు, బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియోజకవర్గాల నేతలు వచ్చారు. వారి వెంట పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 07:47 AM