టీడీపీ నేత కారు దహనం
ABN , Publish Date - May 26 , 2024 | 02:13 AM
టీడీపీ నేత ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారును దుండగులు పెట్రో లు పోసి తగలబెట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు విద్యానగర్ 8లైన్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.
ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుడి ఘాతుకం
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
సింగరాయకొండ, మే 25: టీడీపీ నేత ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారును దుండగులు పెట్రో లు పోసి తగలబెట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు విద్యానగర్ 8లైన్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, లారీ యజమానుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిగురుపాటి గిరికి కొంతకాలంగా వైసీపీ నేత కనసాని ఈశ్వర్రెడ్డితో వివాదం కొనసాగుతోంది. దీంతో ఈశ్వర్రెడ్డి తన లాడ్జిలో పనిచేసే నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరుకు చెందిన మైనర్ బాలుడు, అతని స్నేహితుడు జరుగుమల్లి మండలం నర్సింగోలుకు చెందిన పాలేటి అభిషేక్లకు మూడు బాటిళ్లలో ఐదు లీటర్ల పెట్రోలు ఇచ్చి గిరి కారును తగులబెట్టించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏఎస్పీ(క్రైం) శ్రీధర్బాబు, డీఎస్పీ కిషోర్బాబు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శనివారం సాయంత్రానికి ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సింగరాయకొండ, కొండపి సీఐలు దాచేపల్లి రంగనాథ్, పాండురంగారావు, ఒంగోలు టూటౌన్ సీఐ రాజేష్, సింగరాయకొండ ఎస్ఐ శ్రీరామ్లను ఎస్పీ గరుడ సుమీత్ సునీల్ అభినందించారు.