అంబరాన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Jun 13 , 2024 | 12:46 AM
రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణజిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
బుధవారం ఆదోని పట్టణంలో టీడీపీ శ్రేణులు జోరువానను సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, ఎల్లమ్మగుట్ట తండా తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. ఆస్పరిలో స్థానిక గాంధీ పార్క్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆలూరు పట్టణంలో అంబేడ్కర్, వాల్మీకి విగ్రహాలకు పూలమాల వేసి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. హొళగుంద, గజ్జెహల్లీలో కేక్ కట్ చేసి, బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. పత్తికొండలో తెలుగు యువత, జనసేన ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ర్యాలీ నిర్వహించారు. మార్కెట్యార్డ్వద్ద నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్కడి నుంచి బైక్ర్యాలీ అంబేడ్కర్ సర్కిల్వరకు సాగింది. అనంతరం నాలుగు స్తంభాలకూడలిలో కేక్ కట్చేసి సంబరాలు చేసుకున్నారు. దేవనకొండ టీడీపీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చీ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారాని తిలకించేందుకు ప్రత్యేకంగా స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణా సంచాపేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. బదినేహల్ గ్రామంలో తెలుగు తమ్ముళ్లు గ్రామంలో భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కోసిగి , వందగల్లు, డి.బెళగల్, కోల్మాన్పేట తదితర గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు బీజేపీ, జనసేన నాయకులు సంబరాలు చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు.