మంత్రి లోకేశ్ చొరవ ‘డ్యాన్స్’ డ్రైవరు సస్పెన్షన్ రద్దు
ABN , Publish Date - Oct 29 , 2024 | 04:12 AM
తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ విషయంలో మంత్రి లోకేశ్ చొరవ చూపారు.
విధుల్లోకి తీసుకోవాలని లోకేశ్ ఆదేశం
స్వయంగా వచ్చి కలుస్తానంటూ ట్వీట్
తుని రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ విషయంలో మంత్రి లోకేశ్ చొరవ చూపారు. ఆయనను విధుల్లోకి తీసుకోవాలంటూ డిపో అధికారులను ఆదేశిస్తూ..‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. కాకినాడ జిల్లా తుని డిపోలో నేతల లోవరాజు అనే కాంట్రాక్టు డ్రైవర్ విధులు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల క్రితం ఆయన విద్యార్థులకు ఉద్దేశించిన స్పెషల్ బస్సులో వారిని ఎక్కించుకుని తునికి బయలుదేరారు. అది సింగిల్రోడ్డు కావడంతో కోడూరు సమీపంలో బస్సుకు ఎదురుగా భారీవాహనం నిలిచిపోయింది. బస్సు ముందుకు వెళ్లక, వెనక్క రాలేని పరిస్థితి. ఆ భారీ వాహనాన్ని కదిలించి... రోడ్డును క్లియర్ చేయడానికి కనీసం గంట పడుతుందని భావించారు. ఈ లోపు డ్రైవర్ బస్సుకు ఎదురుగా ‘దేవర’ సినిమా పాటకు డ్యాన్స్ వేశారు. ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో లోవరాజు ప్రతిభ మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది. ఆయన అభినందిస్తూ శనివారం రాత్రి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కాగా, అప్పటికే... లోవరాజును ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త కూడా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్.. సోమవారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. సస్పెన్షన్ ఆదేశాలు రద్దు చేస్తున్నామని, మళ్లీ ఆయన విధులకు హాజరుకావొచ్చని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. త్వరలో ఆ డ్రైవర్ను కలుస్తానని కూడా అన్నారు. ‘ఉద్యోగికి క్రమశిక్షణ అవసరమే. అయితే, హాని కలిగించని వినోదాన్ని నేరంగా పరిగణించలేం’ అరాంరరు.