Share News

ఫోన్‌ ట్యాపింగ్‌పై సుమోటో విచారణ

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:52 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఫోన్‌ ట్యాపింగ్‌పై సుమోటో విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

పత్రికల్లో కథనాల ఆధారంగా నిర్ణయం

సూమోటో లిస్ట్‌కు ఆదివారమే సీజే నిర్ణయం

నేడు విచారణ చేపట్టనున్న సీజే ధర్మాసనం

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంఽధ్రజ్యోతి సహా పలు పత్రికల్లో ఈ అంశంపై వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుమోటో పిటిషన్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇందులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), తెలంగాణ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆంఽధ్య్రజ్యోతి సహా ఇతర పత్రికల కటింగ్‌లు ధర్మాసనం ఎదుట రిజిస్ట్రీ ఉంచింది. హైకోర్టు ఎదుట విచారణ జాబితాలో ఉన్న పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే ఈ నెల 2న ఇచ్చిన ఆదేశాల ప్రకారం పలు పత్రికల్లో మే 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ అయిందని వచ్చిన వార్తా కథనాలను సుమోటోగా ఈ కేసు లిస్ట్‌ చేశారు. హైకోర్టు జడ్జి మొబైల్‌ ట్యాపింగ్‌ గురైనట్లు పత్రికల కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని

, అందులో భాగంగానే జస్టిస్‌ శరత్‌ కూడా టార్గెట్‌గా మారారని ఆ కథనాల్లో ఉంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విమర్శించిన వారి ఫోన్‌లు ట్యాపింగ్‌ చేసినట్లు భుజంగరావు స్టేట్‌మెంట్‌ను ఉటంకిస్తూ రాశారు. టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై విమర్శలు చేసిన వారి ఫోన్లు ట్యాపింగ్‌ చేశారు. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ ఆదేశాల మేరకు హైకోర్టు జడ్జిల ఫోన్‌లు సైతం ట్యాపింగ్‌ చేసినట్లు వార్తా కథనాల్లో ఉంది. సదరు ట్యాపింగ్‌ వ్యవహారాన్ని ప్రభాకర్‌రావే పర్యవేక్షించినట్లు భుజంగరావు స్టేట్‌మెంట్‌లో వెల్లడైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇతర నిందితులు మేకల తిరుపతన్న, డి.ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, భుజంగరావు తదితరులు ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు రాగానే ప్రత్యేక దర్యాప్తు బృందంగా ఏర్పడి, ఉగ్రవాదుల జాడను పసిగట్టే పరికరాలతో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఫోన్‌లు ట్యాప్‌ చేశామని, ప్రణీత్‌రావు ఇచ్చే వివరాల ఆధారంగా జడ్జిలు, ప్రతిపక్ష నేతలు,. అలాగే బీఆర్‌ఎస్‌ సొంత నాయకులపై నిఘా పెట్టామని భుజంగరావు స్టేట్‌మెంట్‌ను ఉటంకిస్తూ పత్రికల్లో పేర్కొన్నారు. విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు ఫోన్‌లు సైతం ట్యాప్‌ చేసినట్లు అందులో పేర్కొన్నారు.

దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా ట్యాపింగ్‌ చేసినట్లు పత్రికల కథనాల్లో ప్రస్తావించారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సివిల్‌ వివాదాలు పరిష్కరించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని భుజంగరావు ప్రకటనలో ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు, పలుకుబడి కలిగిన వ్యక్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ప్రణాళిక వేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ లీడర్ల ఆదేశాలతో పెద్ద మొత్తంలో డబ్బును టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించామని, సంధ్య శ్రీధర్‌రావు చేత రూ.13 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు క్రిమినల్‌ కేసుల భయం చూపి కొనిపించామని స్టేట్‌మెంట్‌లో ఉంది. కేసీఆర్‌ పోటీ చేసిన కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, బీజేపీ అభ్యర్థి వెంకట్రమణారెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై నిఘా పెట్టామని భుజంగరావు అంగీకార ప్రకటన చేసినట్లు పత్రికల కథనాల్లో పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, జీపీఎస్‌ లొకేషన్‌ ఆధారంగా గాలి అనిల్‌ కుమార్‌, కె.వినయ్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిల సన్నిహితుల వద్ద, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సన్నిహితుల వద్ద, యశస్వినిరెడ్డి అత్త ఝాన్సిరెడ్డి వద్ద డబ్బు పట్టుకున్నట్లు భుజంగరావు అంగీకరించారు. తిరుపతన్న నేరాంగీకార ప్రకటన ప్రకారం... కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కంప్యూటర్‌లలో డేటాతో పాటు డివై్‌సలను నాశనం చేసినట్లు తేలింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తగిన ఆదేశాలను జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ ధర్మాసననాన్ని కోరింది.

Updated Date - Jun 04 , 2024 | 03:52 AM