‘రాజధాని ఫైల్స్’ విడుదలను ఆపండి
ABN , Publish Date - Feb 14 , 2024 | 03:05 AM
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలువరించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ట్రైలర్ సీఎం జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉంది
హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ముగిసిన వాదనలు.. మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలువరించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంపై నిర్ణయాన్ని ధర్మాసనం వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చేలా రాజధాని ఫైల్స్ సినిమాను తీశారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎ్ఫసీ) ధృవపత్రాన్ని రద్దు చేయాలని కోరతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందన్నారు. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని, దీన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... గతేడాది డిసెంబరులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎ్ఫసీ) ధృవపత్రాన్ని జారీ చేసిందని, సినిమాలో ఎవరినీ కించపరిచేలా సన్నివేశాలు లేవని, ఎలాంటి మధ్యంతర ఉత్తుర్వులు జారీ చేయవద్దని కోరారు. కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వశాఖ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ.. చట్టనిబంధనల మేరకే సీబీఎ్ఫసీ ధృవపత్రాన్ని జారీ చేసిందన్నారు. వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు.