ప్రమాదంలో శ్రీశైలం!
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:12 AM
శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఆ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలది.
ఇంజనీర్లను బదిలీ చేయొద్దు
శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, నిర్వహణ దృష్ట్యా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, అక్కడ పని చేస్తున్న ఇంజనీర్లను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయొద్దని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి ఈఎన్సీ (అడ్మిన్)కు లేఖ రాశారు. ఖాళీలు భర్తీ చేయకపోగా ఇక్కడ పని చేసే ఇంజనీర్లను బదిలీ చేయడం గమనార్హం. ఇద్దరు ఈఈలను శ్రీశైలం ప్రాజెక్టుకు బదిలీ చేసినా వారు జాయిన్ కాలేదు. డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారు రాజకీయంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏఈఈ ఒకరిని పాత తేదీతో ఉత్తర్వులిచ్చి బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
డ్యాం మరమ్మతులకు రూ.103 కోట్లు
ప్లంజ్పూల్పై అధ్యయనానికి రూ.14.50 కోట్లు
నిర్వహణకు 59 ఇంజనీరింగ్ పోస్టులు
వీటిలో పని చేస్తున్నది 12 మందే.. ఖాళీలు 47
మెయింటెనెన్స్ సర్కిల్లో పోస్టులన్నీ ఖాళీ
కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఆ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలది. జలాశయం నిర్వహణను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డ్యాం భద్రతపై ప్రభావం పడుతుంది. 2009 వరదలకు డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గుంత కారణంగా డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు మరమ్మతులకు రూ.103 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ప్లంజ్పూల్ అధ్యయనానికి ప్రభుత్వం రూ.14.50 కోట్లు మంజూరు చేసింది. నిధులు ఉన్నా పనులను పర్యవేక్షించాలంటే ఇంజనీరింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. అయితే ఈ జలాశయం నిర్వహణకు ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈలు.. ఇలా వివిధ హోదాల్లో 59 మంది ఇంజనీర్లు పని చేయాల్సి ఉండగా.. కేవలం 12 మందే ఉన్నారు. 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయకుండా ఇక్కడ ఉన్నవారిని సైతం బదిలీ చేయడాన్ని చూస్తే ప్రాజెక్టు నిర్వహణపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి తెలుస్తుంది. నిపుణులైన ఇంజనీర్లు లేకుండా నిర్వహణ సాధ్యమా? ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా మరమ్మతులు ఎలా చేస్తారు? 2009 నాటి వరద మళ్లీ వస్తే డ్యాంను సంరక్షించగలమా? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. ఇక్కడ పని చేస్తే ఇంజనీర్లను బదిలీ చేయొద్దు.. అంటూ ప్రాజెక్టు ఎస్ఈ ప్రభుత్వానికి లేఖ రాశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్లంజ్పూల్ అంటే..!
ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం దేవస్థానం దగ్గర కృష్ణా నదిపై 1963 జూలై 24న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి పునాది రాయి వేశారు. కుడిగట్టు విద్యుత్తు కేంద్రం (రైట్ పవర్ హౌస్) సహా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. నీటినిల్వ సామర్థ్యం 308.04 టీఎంసీలు. వరద ప్రవాహ సామర్థ్యం 13.20 లక్షల క్యూసెక్కులు. అయితే జలాశయంలో ఏటేటా చేరుతున్న పూడిక వల్ల జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. 2011లో తీసిన లెక్కల మేరకు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా నిర్థారించారు. అంటే 92.24 టీఎంసీల మేర పూడిక చేరింది. అలాగే వరదను దిగువకు వదిలేందుకు 12 రేడియల్ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. స్పిల్వే గేట్ల నుంచి వరద జలాలు కిందపడి.. మళ్లీ పైకి లేచి నదిలో పడతాయి. దీనినే ప్లంజ్పూల్ అంటారు. ఆ ప్రాంతంలో భారీగా గుంత ఏర్పడింది. ఈ గుంత వల్ల డ్యాం పునాదుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉంది? 2009 అక్టోబరు నాటి వరద మళ్లీ వస్తే డ్యాం తట్టుకోగలదా? ఆనాటి వరదకు ఆనకట్ట, కుడి, ఎడమ గట్లు ఏమేరకు దెబ్బతిన్నాయి? వంటి అంశాలపై నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి. ఈ కమిటీలు డ్యాం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చారు. ఈమేరకు శ్రీశైలం ప్రాజెక్టును పకడ్బందీగా నిర్వహిస్తూ.. 2009 వరదలకు దెబ్బతిన్న డ్యాం మరమ్మతులను తక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు నిధులు, పర్యవేక్షణ, నిర్వహణకు ఇంజనీరింగ్ నిపుణులు కావాలి. ఈ నెల 8న ప్రపంచబ్యాంకు, సీడబ్ల్యూసీ బృందం డ్యాంను పరిశీలించి ఫేజ్-1 కింద రూ.102.58 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాయి. ప్లంజ్పూల్ గుంతపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14.50 కోట్లు మంజూరు చేసింది. నిధులు ఇచ్చినా ఆ పనులు చేయాలంటే ఇంజనీరింగ్ నిపుణులు కావాలి. 80 శాతం ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉంటే.. నాణ్యమైన పనులు చేయగలరా? వెయ్యి టీఎంసీలకుపైగా వరద ఉన్న జలాశయం నిర్వహణ ఎలా సాధ్యం.? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 50-60 శాతం పోస్టులైనా భర్తీ చేస్తేనే.. పనులు ముందుకు సాగుతాయి.

శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఆ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలది. 2009 అక్టోబరులో 25.5 లక్షల క్యూసెక్కుల వరద చేరడంతో వరద ఒత్తిడికి ప్లంజ్పూల్ గుంత ఏర్పడింది. అప్రోచ్ రోడ్డు, రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయాయి. గేట్ల రబ్బర్ సీల్స్ దెబ్బతిని లీకేజీలు వస్తున్నాయి. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని. ప్లంజ్పూల్ గుంతపై అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీలు సూచించాయి. వారి సూచన మేరకు ‘డ్యాం రిహాబిటేషన్ అండ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం’ (డ్రిప్)-2 కింద 19 పనులకు రూ.203 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
ఇంజనీరింగ్ పోస్టులన్నీ ఖాళీనే!
శ్రీశైలం డ్యాం నిర్వహణ కోసం ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈలు 59 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్ఈగా శ్రీరామ చంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. మూడు ఈఈ పోస్టులకు మూడూ ఖాళీగా ఉన్నాయి. 11 డీఈఈ పోస్టులకు 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఈఈ/ఏఈలు 44 పోస్టులకు గానూ 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 9 మందే పని చేస్తున్నారు. అంటే వివిధ హోదాల్లో పని చేయాల్సిన 59 మంది ఇంజనీర్లకుగాను 12 మందే పని చేస్తున్నారు. 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రాజెక్టు భద్రతలో కీలకమైన డ్యాం మెయింటెనెన్స్ సర్కిల్ ఆఫీసులో ఎస్ఈ, డిప్యూటీ ఎస్ఈ, టెక్నికల్ డీఈఈ సహా ఆరుగురు ఏఈఈలకు గానూ.. ఎస్ఈ మాత్రమే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డ్యాం మెయింటెనెన్స్ డివిజన్ పరిధిలో ఈఈ, ఐదుగురు డీఈఈలు, 20 మంది ఏఈఈలు పని చేయాల్సి ఉండగా.. 9 మందే పని చేస్తున్నారు. 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
క్యాంప్ అండ్ బిల్డింగ్ డివిజన్ పరిధిలో ఈఈ, ఐదుగురు డీఈఈలు, 18 మంది ఏఈఈలకు గానూ ఈఈ, డీఈఈ, ముగ్గురు ఏఈఈలు పని చేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డ్యాం ప్రోటెక్షన్ వర్క్స్ డివిజన్ కర్నూలులో ఉంది. ఇక్కడ ఈఈ, ఇద్దరు డీఈఈలు, 10 మంది ఏఈఈలు పని చేయాల్సి ఉంటే.. వంద శాతం భర్తీ చేశారు. ఎందుకంటే ఈ డివిజన్ కర్నూలు నగరంలో ఉంటుంది. పనులు కూడా అంతంతమాత్రమే కావడంతో ఇంజనీర్లు ఆసక్తి చూపుతున్నారు.