త్వరలో టీడీపీలోకి మా కుటుంబం
ABN , Publish Date - Mar 12 , 2024 | 03:01 AM
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో అద్భుతాలు జరుగడం ఖాయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.
![త్వరలో టీడీపీలోకి మా కుటుంబం](https://media.andhrajyothy.com/media/2024/20240306/hh_1cfeaec319.jpg)
ఒంగోలు లోక్సభ
బరిలో నా కుమారుడు
రాజకీయాల నుంచి
రిటైరవుతున్నా: మాగుంట
ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 11: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో అద్భుతాలు జరుగడం ఖాయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసే విధంగా కృషిచేస్తానని ఒంగోలులో తెలిపారు. తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తానిక రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని.. తన కుమారుడికి అవకాశం కల్పించాలని కోరానని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ఒంగోలు లోక్సభ స్థానంలో టీడీపీ తరఫున పోటీ చేస్తారని వెల్లడించారు. జిల్లాలో 33 ఏళ్ల నుంచి మాగుంట కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు చేరువైందని, స్వర్గీయ సుబ్బరామరెడ్డి, పార్వతమ్మతోపాటు తాను ఎంపీగా గెలిచామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డిని పోటీ చేయించాలని తన కుటుంబం నిర్ణయించుకుందన్నారు. చంద్రబాబు ఒంగోలు పర్యటన సోమవారమే జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదాపడిందని, త్వరలోనే తేదీని నిర్ణయించుకుని మాగుంట పార్టీలో చేరతారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ చెప్పారు.