దళితుడిపై ఎస్ఐ దాడి అమానుషం
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:06 AM
ఆలూరు మండలం, పెద్దహోతూరు గ్రామ దళిత యువకుడు రాజశేఖర్పై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా ఎస్ఐ ఓబులేష్ దాడి చేయడం అమానుషమని మానవహక్కుల వేదిక నాయకులు అన్నారు.
![దళితుడిపై ఎస్ఐ దాడి అమానుషం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదోని (అగ్రికల్చర్), మార్చి 26 : ఆలూరు మండలం, పెద్దహోతూరు గ్రామ దళిత యువకుడు రాజశేఖర్పై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా ఎస్ఐ ఓబులేష్ దాడి చేయడం అమానుషమని మానవహక్కుల వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షరాలు సుజ్ఞానమ్మ, ప్రజాసంఘ నాయకులు గంగన్న, ప్రసాద్, జిలాన్ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉచ్చీరప్ప తిరునాలలో మంచినీళ్ల ప్యాకెట్ల కొనడానికి వెళ్లిన దళిత యువకుడు రాజశేఖర్ను లింగాయత్ కులానికి చెందిన విశ్వనాథ్ గౌడు కులం పేరుతో దూషించడమే కాకుండా, అపద్దపు ఫిర్యాదు చేశారని అన్నారు. న్యాయం చేయాల్సిన ఆలూరు తాలూకా ఎస్సై ఓబులేసు బాధితుడి పై కేసు పెట్టి, కుడి కాలి బోటనవేలు విరిగేలా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఇంతవరకు పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోలేదని అన్నారు. విశ్వనాథ్ గౌడ్ పైన, ఎస్సై ఓబులేష్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.