Share News

కడప నుంచే షర్మిల పోటీ!

ABN , Publish Date - Mar 21 , 2024 | 02:55 AM

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని ఆమె గురువారం వెల్లడిస్తారని తెలుస్తోంది.

కడప నుంచే షర్మిల పోటీ!

నేడు జిల్లా కాంగ్రెస్‌ సీనియర్లతో భేటీ

అనంతరం నిర్ణయం వెల్లడి?

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని ఆమె గురువారం వెల్లడిస్తారని తెలుస్తోంది. గతంలో ఆమె ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోలేదు. అయితే పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు, నేతల్లో నూతనోత్సాహం నెలకొందని.. ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే పార్టీ పునరుజ్జీవానికి దోహదపడుతుందని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ముంబైలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. కడప నుంచి లోక్‌సభకు పోటీచేయాలని షర్మిలకు సూచించారు. నాటి నుంచి దీనిపై ఆమె కసరత్తు చేస్తున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం విజయవాడలో పీసీసీ కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్‌లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్‌ నేతలతో షర్మిల సమావేశమవుతున్నారు. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సహా పలువురు నాయకులను ఈ భేటీకి ఆహ్వానించారు. వీరందరితో చర్చించాక.. గురువారమే ఆమె తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. కడప నుంచి షర్మిల బరిలోకి దిగితే.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. ఆమె అన్న సీఎం జగన్‌కు ఇబ్బందులు తప్పవని అంటున్నాయి. ప్రతి రోజూ జగన్‌ పాలనను తూర్పారబట్టడంతోపాటు.. చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తుంటే దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగానే ఉంటుందన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోందని పేర్కొంటున్నారు.

కాంగ్రె్‌సలోకి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా కోడుమూరు (ఎస్సీ) మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ తిరిగి కాంగ్రెస్‌ గూటికి వచ్చారు. బుధవారం హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌ నివాసంలో ఆయన షర్మిలతో సమావేవమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మురళీకృష్ణకు కాంగ్రెస్‌ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - Mar 21 , 2024 | 02:55 AM