Share News

Sharmila : జగన్‌... నీ పాలన మహిళల భద్రతకు పట్టిన చీడ

ABN , Publish Date - May 25 , 2024 | 04:00 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్ర మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన చీడ’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharmila : జగన్‌... నీ పాలన మహిళల భద్రతకు పట్టిన చీడ

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్ర మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన చీడ’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆమె శుక్రవారం రాష్ట్రంలో ఏలూరు జిల్లా మండవల్లిలోని ఓ పాఠశాలలో 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యిందంటూ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఉదహరిస్తూ ఎక్స్‌లో స్పందించారు. ‘నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్‌ ప్రేమలూ నటించే ముఖ్యమంత్రిగారూ... మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకూ, బతుకులకూ పట్టిన పీడ దేశమంతా చెప్పుకుంటోంది. లండన్‌ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలూ, హాహాకారాలూ వినపడవు. రాష్ట్రానికి అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులూ, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు’ అని షర్మిల అన్నారు. కాగా, జూన్‌ 1న షర్మిల రాష్ట్రానికి రానున్నారు. 4న ఓట్ల లెక్కింపు జరగనున్నందున పార్టీ నేతలతో, ఏజెంట్లతో విస్తృతంగా సమావేశం కానున్నారు. కడప లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ధీమాలో షర్మిల ఉన్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంచనాలకు మించి మెజారిటీ వస్తుందన్న విశ్వాసాన్ని షర్మిల సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 25 , 2024 | 04:00 AM