వెంకట్రామిరెడ్డికి షాక్!
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:37 AM
ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి గట్టి షాక్ తగిలింది.
సచివాలయం క్యాంటీన్ ఎన్నికల్లో పరాభవం
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. అప్సా మాజీ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ, మాజీ కార్యదర్శి గొలిమి రామకృష్ణ మద్దతుతో పోటీ చేసిన 11మంది అభ్యర్థుల్లో 10 మంది ఘన విజయం సాధించారు. ఒకరు స్వతంత్రంగా గెలుపొందారు. ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. 11 డైరెక్టర్ పదవుల కోసం 28మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 1,058 మంది ఓటర్లు ఉండగా 937 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లు క్యాంటీన్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మురళీకృష్ణ, రామకృష్ణ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.
వెంకట్రామిరెడ్డి రాజీనామాకు డిమాండ్
ఎన్నికల ఫలితాలు త్వరలో జరిగే అప్సా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వెంకట్రామిరెడ్డి చేసిన క్యాంపు రాజకీయాలు, తాయిలాలు, మందు పార్టీల పేరుతో లాబీయింగ్లన్నీ విఫలమయ్యాయి. సచివాలయ ఉద్యోగులందరూ ఆయన్ను ఏకపక్షంగా తిరస్కరించారు. అప్సా అధ్యక్ష పదవికి వెంకట్రామిరెడ్డి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గెలుపొందిన అభ్యర్థులు,ఓట్లు వివరాలు: కె. దుర్గాప్రసాద్రావు (562), ఆర్. అయ్యపరెడ్డి (524), షేక్ షర్మిల బేగం (478), నక్కెళ్ల వెంకట్రావు (474), ఎస్. ఆనందరావు (440), బండి పద్మజ (423), ఎస్. శివప్రసాద్ (407), మురళీ కిశోర్ (406), కె. అనిల్ (405), కేవీ రామ్మోహన్ (394), ఆప్సా మాజీ నేతల మద్దతుతో, చింతల ప్రసన్న కుమార్ (453) స్వతంత్రంగానూ గెలుపొందారు. కాగా, సచివాలయ ఉద్యోగులకు అప్సా మాజీ అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.