‘పోస్టల్’పై జోక్యానికి సేసెమిరా
ABN , Publish Date - Jun 04 , 2024 | 03:59 AM
పోస్టల్ బ్యాలెట్ల అంశంలోనూ వైసీపీకి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ ఉండాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలను ఆ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
![‘పోస్టల్’పై జోక్యానికి సేసెమిరా](https://media.andhrajyothy.com/media/2024/20240603/fd_a6fe70d1a5.jpg)
జోక్యం చేసుకుంటే ఓట్ల లెక్కింపుపై ప్రభావం
సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. వైసీపీకి అక్కడా ఎదురుదెబ్బే
న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): పోస్టల్ బ్యాలెట్ల అంశంలోనూ వైసీపీకి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ ఉండాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలను ఆ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై సోమవారం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగనుండగా.. ఈ దశలో జోక్యం చేసుకోవడం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రభావం చూపుతుందని తెలిపింది. వైసీపీ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుతోపాటు పోస్టల్ బ్యాలెట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని తెలుగుదేశం సీనియర్ నేత, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం సుప్రీంకోర్టు ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ల అంశంపై హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించిందని.. వైసీపీ పిటిషన్ను తిరస్కరించిందన్నారు.