ఎస్బీఐ మోదీ బ్యాంకు కాదు
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:03 AM
‘ఎస్బీఐ మోదీ బ్యాంకు కాదు. అది ప్రజల బ్యాంక్’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మోదీని, బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తోందని ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలి: షర్మిల
విజయవాడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘ఎస్బీఐ మోదీ బ్యాంకు కాదు. అది ప్రజల బ్యాంక్’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మోదీని, బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తోందని ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగరంలోని ఎస్బీఐ వద్ద గురువారం ఆమె ధర్నా చేపట్టారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏయే పార్టీకి ఎంతెంత విరాళాలు వెళ్లాయన్న విషయం బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు ఎస్బీఐ ఆ పని చేయలేదని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి కార్పొరేట్ కంపెనీలపై దాడులు చేయించి తర్వాత వాటిని దారికి తెచ్చుకుందని బీజేపీపై మండిపడ్డారు. వారు దారికి రాగానే రూ. కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలుగా తీసుకుందన్నారు. దీన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్బీఐ ప్రజల బ్యాంకుగా కాకుండా మోదీ బ్యాంకుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ మోదీ సంస్థలు కాదని, ప్రభుత్వ సంస్థలని చెప్పారు. ఈ బాండ్ల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదో ఎస్బీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీని రక్షించడానికే ఎస్బీఐ ఈ వివరాలను బయట పెట్టడానికి జూన్ వరకు సమయం కావాలని అడిగిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.