చంద్రబాబుతో సత్యకుమార్ భేటీ
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:25 AM
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ధర్మవరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తోన్న సత్యకుమార్..

రాష్ట్ర దుస్థితి, రాజకీయాలపై చర్చ
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ధర్మవరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తోన్న సత్యకుమార్... తన విజయానికి కావాల్సిన మద్దతు టీడీపీ శ్రేణుల నుంచి సంపూర్ణగా ఇప్పించాల్సిందిగా కోరారు. ఈనెల 4న ధర్మవరం వెళుతున్నానని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు దీవించాలని కోరడంతో స్పందించిన చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలకు ఫోన్చేసి సత్యకుమార్ విజయం కోసం గట్టిగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఇప్పటికే పార్టీ శ్రేణులతో చర్చించి సత్యకుమార్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు వ్యూహం సిద్ధం చేశారని తెలిసింది. దీంతో బీజేపీ టికెట్ ఆశించిన వరదాపురం సూరి మద్దతు కూడా తీసుకుంటే మెజారిటీ మరింత పెరుగుతుందన్న ధీమా వ్యక్తమైంది. మోదీ నేతృత్వంలో దేశం ప్రపంచవ్యాప్తంగా బలీయమైన శక్తిగా ఎదుగుతుంటే మన రాష్ట్రం సర్వ నాశనమైందని సత్య కుమార్ వ్యాఖ్యానించగా... ‘ఆ బాధ నన్ను నిరంతరం వేధిస్తుంటుంది. 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. చేసి చూపిస్తా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పట్లో మీరు మాత్రమే బాగు చేయగలరని చంద్రబాబుతో సత్యకుమార్ అనగా... ‘కేంద్రం మద్దతు కూడా కావాలి. మీరంతా సహకరించాలి’ అని టీడీపీ అధ్యక్షుడు కోరారు. రాష్ట్రం కోసం తాము పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధమని సత్య బదులిచ్చారు.