Share News

‘పింఛను’పై అదే కుట్ర

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:45 AM

సామాజిక పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తేల్చేశారు.

‘పింఛను’పై అదే కుట్ర

ఇంటి వద్ద పంపిణీ కుదరదన్న సీఎస్‌

ఏప్రిల్‌లో చేసినట్లే చేస్తామని ఈసీకి వెల్లడి

చంద్రబాబు లేఖపై స్పందన కోరిన కమిషన్‌

జాబ్‌ చార్ట్‌ పేరుతో ‘బిజీ’ కబుర్లు

సచివాలయ సిబ్బందితో పంపిణీ కుదరదట

ఈసారి 3వ తేదీలోపు ముగించేస్తాం

ఉదయం 7 నుంచి రాత్రి 7 దాకా పంపిణీ

అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తేల్చేశారు. ఏప్రిల్‌లో చేసినట్లుగానే మే నెలలోనూ పింఛన్ల పంపిణీ ఉంటుందని ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేశారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కుదరదని, వారిని ఎన్నికల ప్రక్రియకు పూర్తి దూరంగా ఉంచాలని ఈసీ గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఏప్రిల్‌ నెల పింఛన్లపై వైసీపీ కుట్ర రాజకీయానికి తెరలేపింది. ఏప్రిల్‌ 3 తర్వాతే పింఛన్ల పంపిణీ ఉంటుందని ముందగానే ప్రకటించినప్పటికీ... విపక్షాలవల్లే పింఛన్లు ఆలస్యమవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేసింది. 4వ తేదీ సాయంత్రందాకా అరకొరగానే నిధులు విడుదల చేసింది. అదే సమయంలో... మంచానపడిన వృద్ధులను వైసీపీ శ్రేణులు రోడ్లపైకి తీసుకొచ్చి, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయాల వద్ద పింఛన్లకోసం పడిగాపులు కాసేలా చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, పంచాయతీరాజ్‌ సిబ్బంది ద్వారా ఒకటి రెండు రోజుల్లోనే నేరుగా అవ్వా తాతలకు వారి ఇళ్ల వద్దే పింఛను ఇచ్చే అవకాశమున్నప్పటికీ అలా చేయలేదు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇళ్ల వద్ధ పింఛను ఇస్తామని సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబుతోపాటు విపక్ష నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మే 1వ తేదీన ఇళ్లవద్దే పింఛను పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎన్నికల కమిషన్‌, ఎన్నికల స్పెషల్‌ అబ్జర్వర్‌కు సీఎస్‌ జవహర్‌ రెడ్డి సమాధానమిచ్చారు. ‘ఇంటింటికీ పింఛను పంపిణీ’ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్‌ అధికారులతో, కలెక్టర్లతో సమీక్షించామని.. అది సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడికి లేఖ రాశారు. ‘‘15,.004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల మందికిగాను 1.26 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే... సగటున ఒక్కో సచివాలయంలో పని చేస్తున్నది 8 మందిమాత్రమే. ఇక... ఏఎన్‌ఎంలు/వార్డుహెల్త్‌ సెక్రటరీలు, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లకు జాబ్‌ చార్ట్‌ మేరకు వారి పనులు వారికి ఉంటాయి. 41 వేల మంది బీఎల్‌వో విధులతో చాలా బిజీగా ఉన్నారు. 55,900 మంది ఓపీఓ డ్యూటీల్లో ఉన్నారు. అందువల్ల ఇంటింటికీ వెళ్లి పింఛను ఇవ్వడం కుదరదు’’ అని తేల్చేశారు. గత నెలలోలాగా దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు మాత్రమే ఇళ్లవద్ద పింఛను అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి ‘జాబ్‌ చార్ట్‌’ మేరకు పనులుంటాయంటున్న ప్రభుత్వం అవ్వాతాతల కోసం ఒక్కరోజు సిబ్బందిని కేటాయించలేరా అనే ప్రశ్న వినిపిస్తోంది. గతంలో టీచర్లకు రకరకాల డ్యూటీలు వేయలేదా? మరి... సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛను పంపిణీ చేయిస్తే తప్పేంటి?

ఎవరూ మరణించలేదు...

పింఛను కోసం వెళ్లి అనేక మంది వృద్ధులు మరణించారని... దీనికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. కానీ... అవకాశముండి ఇంటింటికీ పింఛను ఇవ్వకుండా వృద్ధుల మరణానికి కారణమయ్యారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే... పింఛను పంపిణీలో జాప్యం, ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరూ మరణించలేదని పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్పష్టం చేయడం గమనార్హం. ఈసారి 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని, గరిష్ఠంగా 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. పింఛను పంపిణీకి దాదాపు 10వేల అదనపు కేంద్రాలను గుర్తించామని... వృద్ధులకు ఇబ్బంది లేకుండా నీడ కోసం టెంట్లు, నీళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 7 నుంచే పంపిణీ మొదలుపెట్టి... రాత్రి 7 గంటల వరకు కొనసాగిస్తామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 04:45 AM