ఈసీ వద్ద భద్రంగా డేటా!
ABN , Publish Date - Feb 07 , 2024 | 04:15 AM
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయం డేటా మొత్తం ఈసీఐ వద్ద భద్రంగా ఉందని సీఈవో ముఖేశ్కుమార్ మీనా తెలిపారు.
![ఈసీ వద్ద భద్రంగా డేటా!](https://media.andhrajyothy.com/media/2023/20231205/nnnnn_c3a436b7cc.jpg)
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సీఈవో మీనా వివరణ
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయం డేటా మొత్తం ఈసీఐ వద్ద భద్రంగా ఉందని సీఈవో ముఖేశ్కుమార్ మీనా తెలిపారు. ఈసీఐ నిర్దేశించిన బలమైన డేటా సెక్యూరిటీ ఆధారంగా తమ కార్యాలయం పారదర్శకంగా పని చేస్తుందని అన్నారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఈసీలో దొంగలు పడ్డారు’ కథనంపై ఆయన స్పందించారు. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న డేటా ఎలా పోతుందని ప్రశ్నించారు. ‘ఈసీ పరిధిలో ఉండే ఈఆర్వో నెట్ నుంచి ఎలాంటి సమాచారం డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు. ఏదైనా సమాచారం కోసం సీఈవో, డీఈవో, ఈఆర్వోకి కేవలం కొద్దిపాటి సౌలభ్యమే ఉంటుంది’ అని తెలిపారు. ఈసీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వో నెట్ 2.0 ఉపయోగిస్తుందని.. ఈ డేటా మొత్తం సైబర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం దాని భద్రంగా ఉంటాయని తెలిపారు. సీఈవో వెబ్సైట్లో సాధారణ ప్రజల కోసం కొంత సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు హార్డ్డి్స్కలు అందిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం.. కొందరిని తొలగించడం లాంటివి సీఈవో వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని ప్రతి వారం సీఈవో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ శాఖల సమన్వయానికి ప్రత్యేక యాప్
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించాలంటే కేంద్ర, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని మీనా పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ శాఖల మధ్య సమన్వయం కోసం త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.