‘పసుపు’ తీసేయండి.. వైసీపీ కండువా కప్పుకోండి
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:09 AM
కర్ణాటకకు చెందిన డోలు కళాకారుల పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనుచితంగా వ్యవహరించారు.
కర్ణాటక డోలు కళాకారుల పట్ల వైసీపీ కార్యకర్తల అనుచిత ప్రవర్తన
పెనుకొండ రూరల్, ఏప్రిల్ 25: కర్ణాటకకు చెందిన డోలు కళాకారుల పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనుచితంగా వ్యవహరించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉష శ్రీచరణ్ గురువారం నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కర్ణాటకలోని రాంనగర్కు చెందిన ఏడుగురు డోలు కళాకారులను రప్పించారు. ఉష శ్రీచరణ్ ఇంటి సమీపంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద డోలు వాయిస్తున్న కళాకారులపై ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడి, దాడికి యత్నించారు. ఆ కళాకారులు.. టీడీపీ రంగు అయిన పసుపు రుమాలు, భుజానికి అదే రంగు కుచ్చిళ్లు ధరించడమే ఇందుకు కారణం. వాటిని తీసేసి, వైసీపీ కండువాలు కట్టుకుని డోలు వాయించాలని దౌర్జన్యం చేశారు. కళాకారుల నెత్తిన ఉన్న రుమాళ్లను బలవంతంగా తొలగించారు. దీంతో కళాకారులు మనస్తాపం చెంది, డోలు వాయించకుండా ఓ మూలన కూర్చుండిపోయారు.