సెప్టెంబరు 17న అశోక్ లేలాండ్ పునఃప్రారంభం
ABN , Publish Date - Aug 17 , 2024 | 02:44 AM
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బస్ బాడీ బిల్డింగ్ ప్లాంటు సెప్టెంబరు 17న పునఃప్రారంభం కానుంది.
మల్లవల్లిలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ప్రారంభోత్సవానికి హాజరుకానున్న లోకేశ్
విజయవాడ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బస్ బాడీ బిల్డింగ్ ప్లాంటు సెప్టెంబరు 17న పునఃప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. సుమారు 75 ఎకరాల్లో రూ.130 కోట్ల పెట్టుబడితో 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన సహకారం లేక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక అశోక్ లేలాండ్ పునఃప్రారంభంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఆయన సూచనల మేరకు స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పలుమార్లు అశోక్ లేలాండ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ యాజమాన్యం తాజాగా మరో రూ.10 కోట్లతో తుది దశ పనులను శరవేగంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ శుక్రవారం మరోసారి ఆ ప్రతినిధులను కలిశారు.