తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ABN , Publish Date - May 29 , 2024 | 03:47 AM
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత గురువారం సాయంత్రం మొదలైన రద్దీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి భక్తుల రాక తగ్గడంతో దర్శన సమయం 30 గంటల నుంచి 15 గంటలకు తగ్గింది.
![తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తిరుమల, మే 28 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత గురువారం సాయంత్రం మొదలైన రద్దీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి భక్తుల రాక తగ్గడంతో దర్శన సమయం 30 గంటల నుంచి 15 గంటలకు తగ్గింది. నాలుగురోజుల పాటు రోడ్లపై రెండు కిలోమీటర్ల మేరకు కనిపించిన క్యూలైన్లు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్లుమెంట్లలో వేచి ఉన్న టోకెన్ రహిత భక్తులకు 15 గంటల దర్శన సమయం పడుతోంది. తిరుపతిలో టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లు పొందిన భక్తులకు గంటన్నర నుంచి రెండుగంటల దర్శన సమయం పడుతోంది. గది పొందేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. కాగా శుక్రవారం నుంచి సోమవారం వరకు 3,25,526 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.15.83 కోట్లు లభించింది. 1.53 లక్షల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.