ఘనంగా రంజాన్
ABN , Publish Date - Apr 12 , 2024 | 01:14 AM
జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం రాత్రి నెలవంక కనిపించడంతో ఉపవాసాలు ముగించారు. ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజులపాటు నియమనిష్ఠలతో గడిపిన ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. స్థానికంగా ఉండే ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు ఒకరికొకరు అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదోనిలోని పురాతన జామియా మసీదు, షాహిమాం దర్గా, చంద్షాదర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఎమ్మిగనూరు ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని ఈద్గాలో మతగురువు సయ్యద్ షా మహ్మద్ పీర్ ఖాద్రీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను వేలమంది ముస్లిం నిర్వహించారు. ఆలూరు పట్టణంతో పాటు హత్తిబెళగల్, మొలగవల్లి, హులేబీడు, అరికేర, కురువల్లి, కమ్మరచేడు గ్రామాల్లోని ఈద్గాలో ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిప్పగిరిలోని ప్రసిద్ధ దరా సత్తార్హది, భంభం సాహెబ్ దర్గాలలో సలాములు చదివి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)