విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ
ABN , Publish Date - Nov 08 , 2024 | 06:08 AM
విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం భూమి పూజ చేసింది.
తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం భూమి పూజ చేసింది. అకాడమీ ఏర్పాటు నిమిత్తం ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్లో రెండెకరాలు కేటాయించింది. అయితే అదనంగా మరింత భూమి కావాలని సింధు కోరగా, ఆ తరువాత ప్రభుత్వం మరో ఎకరా కేటాయించింది. మొత్తం మూడెకరాల్లో అకాడమీ నిర్మాణానికి ఇటీవల భూమి చదును చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ స్థలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో సింధు.. సీఎం చంద్రబాబునాయుడును కలిసి సమస్యను వివరించింది. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని, అక్కడే పనులు ప్రారంభించుకోవాలని సీఎం ఆమెకు సూచించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ను ఆ మేరకు తగిన సహకారం అందేలా చూడాలని ఆదేశించారు. కాగా తాము ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే పనులు చేపడుతున్నామని సింధు తండ్రి రమణ చెప్పారు. ఏడాదిలోగా అకాడమీ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.