పాఠశాల విద్యలో ప్రక్షాళన మొదలు
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:18 AM
పాఠశాల విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైంది. డైరెక్టరేట్లో సర్వీసెస్ జేడీగా ఉన్న మువ్వా రామలింగంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
సర్వీసెస్ జేడీ రామలింగంపై బదిలీ వేటు
టీచర్ల అక్రమ బదిలీల వ్యవహారంలో ఆరోపణలు
త్వరలో డైరెక్టరేట్లో మరిన్ని బదిలీలు
డీఈవోలనూ బదిలీ చేసే అవకాశం
అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైంది. డైరెక్టరేట్లో సర్వీసెస్ జేడీగా ఉన్న మువ్వా రామలింగంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ బాధ్యతలను డైరెక్టర్ పి.పార్వతికి అప్పగించారు. గత ప్రభుత్వంలో జరిగిన టీచర్ల అక్రమ బదిలీల వ్యవహారంలో రామలింగంపై ఆరోపణలున్నాయి. సర్వీసెస్ జేడీగా ఉంటూ బదిలీల వ్యవహారంలో ఆయనే చక్రం తిప్పారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అప్పటి ప్రభుత్వం సుమారు 2,400 మంది టీచర్లకు అడ్డగోలుగా సిఫారసు బదిలీల పేరిట ఆర్డర్లు జారీచేసింది. ఎన్నికలకు ముందు చేసిన వాటిలో 917 మంది బదిలీలను అప్పటి సీఎం జగన్ రాటిఫై చేయకపోవడంతో కొత్త ప్రభుత్వం వాటిని రద్దుచేసింది. కానీ.. అంతకుముందు బదిలీలు అడ్డగోలుగా జరిగిపోయాయి. ఇందులో రామలింగం పాత్ర ఉందని పలువురు మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు రామలింగం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ సంయుక్త కార్యదర్శితో కలిసి అక్రమ బదిలీల్లో జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం భారీగా అక్రమ బదిలీలు చేయడంతో ఈ ఇద్దరు అధికారులు కలిసి సుమారు 30 మంది టీచర్ల బదిలీలు సొంతంగా చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో టీచర్ నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలు వసూలు చేశారు.
ఈ బదిలీల వ్యవహారంలో రామలింగం అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పూర్తిగా సహకరించారు. అప్పటి కమిషనర్ సురేశ్కుమార్ను పక్కనపెట్టి మరీ బొత్స కార్యాలయం రామలింగం ద్వారా బదిలీలు చేయించింది. ఈ క్రమంలో మంత్రి కార్యాలయంతో అంటకాగిన అంశం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు బదిలీ వేటు వేసింది. ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై విచారణకు ఆదేశించనుంది. ఆయనపై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. అన్నిటినీ కలిపి విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాఠశాల విద్యాశాఖలో మరిన్ని మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కీలక పోస్టుల్లో ఉన్న వారిని మార్చనుంది. డైరెక్టరేట్, ఎస్సీఈఆర్టీ, సమగ్రశిక్ష, ఇతర విభాగాల్లోనూ మార్పులు చేయనుంది. అలాగే కొందరు డీఈవోలనూ మార్చాలని భావిస్తోంది. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కీలక స్థానాలు అప్పగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో గత ప్రభుత్వంలో అధికారుల పాత్ర, సమర్థత ఆధారంగా బదిలీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.