నేను తప్పు చేసినా శిక్షించండి!
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:29 AM
ప్రభుత్వంలో ఎవరు తప్పు నిస్సందేహంగా శిక్షించాలి. నా ద్వారా తప్పులు, అవకతవకలు జరిగినా.. నాపైనా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషిచేస్తాం: పవన్
చంద్రబాబు అనుభవం అవసరం
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదాకా
ఆయన కనుసన్నల్లో పనిచేస్తాం
మన రాజధాని అమరావతే
15 వేల కోట్లు ప్రకటించిన మోదీకి ధన్యవాదాలు
ధన్యవాద తీర్మానంపై చర్చలో డిప్యూటీ సీఎం
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వంలో ఎవరు తప్పు నిస్సందేహంగా శిక్షించాలి. నా ద్వారా తప్పులు, అవకతవకలు జరిగినా.. నాపైనా చర్యలు తీసుకోవాలి. మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర పునర్మిర్మాణం కోసం, మీ కోసం ఆహర్నిశలు పని చేస్తాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకూ మీ కనుసన్నల్లోనే పని చేస్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో తాను మూడు అంశాలను పరిశీలించానన్నారు. వారసత్వంగా ఏం చేయబోతున్నాం, కూటమి ద్వారా ఎలా ముందుకు వెళ్తున్నామన్న విషయం స్పష్టంగా చెప్పారని తెలిపారు. చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన ప్రత్యర్థులను కూడా గౌరవించే వ్యక్తి. వైఎస్ తన ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన గురించి మంచి మాటలు చెప్పేవారు. చేసిన మంచి పనుల గురించీ చెబుతుంటారు. నాలాంటి యువకులు, కొత్తగా సభలోకి వచ్చినవారు ఆయన్ను చూసి నేర్చుకోవాలి’ అని సూచించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తే.. జగన్ వచ్చి మూడు రాజధానులంటూ గందరగోళం చేశారని.. దశాబ్దాల తర్వాత కూడా రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతే రాజధానిగా ఉండాలన్నారు. పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య దగ్గర నుంచి మనకు మంచి వస్తే.. గత ప్రభుత్వం చెడును పరిచయం చేసిందన్నారు. ‘జగన్ పోలవరం పూర్తి చేయలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం, అన్ని శాఖల నుంచి నిధులు మళ్లించడం, వ్యవస్థల నిర్వీర్యం, సహజవనరులు, ఎర్రచందనం దోపిడీ వంటివి చేశారు. పెట్టుబడుదారులను పారిపోయేలా చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికీ రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. దీనిని అధిగమించడానికి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకుని, ఆయన కింద పని చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింపజేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు.
3 పార్టీల కార్యకర్తలపై కేసులు: కాలవ
అంతకుముందు ధన్యవాదాల తీర్మానంపై చర్చను టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. జగన్ హయాంలో 72 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను బలి తీసుకున్నారని తెలిపారు. ‘2,500 మంది టీడీపీ శ్రేణులపైన, 2,014 మంది జనసేన శ్రేణులు, 69 మంది బీజేపీ నాయకులపై కేసులు పెట్టారు. అరాచక పాలనను తప్పించి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు’ అని గుర్తుచేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. 2019-24 నడుమ వనరులను దోచేశారని, పనికిమాలిన రంగుల కోసం కోట్లు డబ్బులు వృథా చేశారని ఆక్షేపించారు. కేంద్రం అమరావతికి 15 వేల కోట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. జగన్ను సభకు పిలిపించాలని, అవసరమైతే ఫోన్ చేసి రప్పించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి... స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ఎవరు నోరు విప్పినా, చివరికి ఫ్లెక్సీలు కట్టినా గత ప్రభుత్వం కేసులు పెట్టిందని.. తనపై 14 కేసులు పెట్టారని, స్పీకర్ఫై దాదాపు 15, 16 కేసులు ఉన్నాయని.. లోకేశ్పైనా పెట్టారని రఘురామరాజు వ్యాఖ్యానించారు.
రఘురామ స్ఫూర్తి..
రఘురామకృష్ణంరాజును కేసులతో ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం పెద్ద మనసుతో జగన్తో మనసువిప్పి మాట్లాడడం చాలా ఆనందం కలిగించిందని పవన్ అన్నారు. ‘మీపై దాడి చేసినా, హాని చేసినామీరు మంచి మనసుతో పలకరించారు. సభా ముఖంగా ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెబుతున్నా. మీ నుంచి ఈ స్ఫూర్తిని తీసుకుంటా. సీఎం చంద్రబాబు కూడా ఇదే చెప్పారు. మనకు 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలున్నారని ఆవేశపడడం కరెక్టు కాదని, సిస్టమ్ ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పారు. మేమంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటాం. గత ప్రభుత్వం చేసింది.. మేమూ చేస్తామని అంటే.. జనసేన నుంచి నియంత్రించే బాధ్యత మేం తీసుకుంటాం. రాష్ట్ర భవిష్యత్, పునర్నిర్మాణం కోసం సర్వం త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నాం’ అని చెప్పారు. కేంద్రం అమరావతికి 15 వేల కోట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ శాసనసభ పక్ష నేతగా జగన్...
వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును స్పీకర్ ప్రకటించారు. పార్టీలు తమ శాసనసభాపక్షాల కార్యవర్గ సభ్యుల పేర్లను ఆయనకు అందించడంతో ఆయన వారి పేర్లను సభలో చదివారు. జనసేన ఉపనేతగా నాదెండ్ల మనోహర్(తెనాలి), ఆ పార్టీ విప్గా లోకం మాధవి (నెల్లిమర్ల), కోశాధికారిగా పులపర్తి రామాంజనేయులు (భీమవరం), కార్యదర్శులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ దక్షిణ), దేవర వరప్రసాద్ (రాజోలు)ను పవన్ కల్యాణ్ నియమించారు.