కొబ్బరి సాగుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:59 PM
కొబ్బరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉద్యానశాఖ డీడీ, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి తెలిపారు.

ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉద్యానశాఖ డీడీ, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి తెలిపారు. కొబ్బరి సాగులో సాంకేతిక పరిజ్ఞానంపై శనివారం కర్నూలు నగరంలోని ఉద్యాన భవనలో సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొబ్బరి సాగుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందజేయాలో అవగాహన కల్పించేందు కోసం పెద్ద ఎత్తున ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త ఎం.తిరుపతిరెడ్డి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వాతావరణం కొబ్బరి సాగుకు ఎంతో అనుకూలంగా ఉందని, రైతులు కొబ్బరితో పాటు ఇతర ఉద్యాన పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందేలా ఉధ్యానశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొబ్బరి పంటలో వ్యాపించే చీడపీడల నివారణకు ఏ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలో వారు రైతులకు వివరించారు. కోకోనట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమారవేలు మాట్లాడుతూ కొబ్బరి పంట సాగు చేయడం ద్వారా రైతులు ఏ విదంగా లాభం పొందుతారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుందో వివరించారు. డీడీ ఉమాదేవి మాట్లాడుతూ కొబ్బరి పంట సాగు కోసం కోకో నట్ డెవలప్మెంట్ బోర్డు అందించే పథకాల గురించి వివరించారు. జిల్లా ఉధ్యానశాఖ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ కొబ్బరి పంట యొక్క ప్రాముఖ్యత, అదే విధంగా కొబ్బరి పంట సాగు వల్ల వచ్చే ఆదాయాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులు, ఏపీడీ రాధాకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.