ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాల్గొనకుండా నిరోధించండి
ABN , Publish Date - Mar 14 , 2024 | 04:24 AM
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా, గ్రామ-వార్డు సచివాలయ వలంటీర్లను నిలువరించాలని, వారు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా నిరోధించాలని కోరుతూ కడపజిల్లా, రాజంపేటకు చెందిన షేక్ అబుబాకర్ సిద్ధిఖి దాఖలు చేసిన పిల్ మార్చి 20కి వాయిదా పడింది. బుధవారం వ్యాజ్యం విచారణకు రాగా అడ్వకేట్ జనరల్
![ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాల్గొనకుండా నిరోధించండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైకోర్టులో పిల్... విచారణ 20కి వాయిదా
విషయాన్ని తేల్చాల్సింది ఎన్నికల సంఘం: మరో బెంచ్
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా, గ్రామ-వార్డు సచివాలయ వలంటీర్లను నిలువరించాలని, వారు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా నిరోధించాలని కోరుతూ కడపజిల్లా, రాజంపేటకు చెందిన షేక్ అబుబాకర్ సిద్ధిఖి దాఖలు చేసిన పిల్ మార్చి 20కి వాయిదా పడింది. బుధవారం వ్యాజ్యం విచారణకు రాగా అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ... వలంటీర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ 2019లో పిల్ దాఖలైందన్నారు. హైకోర్టు విచారణ జరిపి దానిని పరిష్కరించిందన్నారు. వలంటీర్లతో ముడిపడిన మరో వ్యాజ్యం ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంబంధ విధులకు వలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ప్రతిఇంటికీ వెళ్లి వైసీపీ తరఫున ప్రచారం చేయాలని వలంటీర్లకు బహిరంగంగా పిలుపు ఇచ్చారన్నారు. ఈ దశలో ధర్మాసనం కలగజేసుకుంటూ వలంటీర్ల వ్యవహారంలో ఈ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించాలని సీనియర్ న్యాయవాదికి సూచించింది. తరువాత పిల్పై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
సీఎం ప్రసంగం రాజ్యాంగ విరుద్ధమని ఎలా ప్రకటిస్తాం?
ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం జగన్ రాజకీయ ప్రసంగం చేయడంతో పాటు వైసీపీ తరఫున ప్రచారం చేయాలని వలంటీర్లను కోరడాన్ని సవాల్ చేస్తూ బాపట్ల జిల్లా అన్నంబొట్లవారిపాలెంకి చెందిన చెన్నుపాటి సింగయ్య వేసిన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. సీఎం ప్రసంగాన్ని రాజ్యాంగ విరుద్ధమని ఎలా ప్రకటించగలమని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.