అంబేడ్కర్కు విగ్రహాలు అవసరమా?
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:46 AM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు విగ్రహాలు అవసరమా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని అంబేడ్కర్ స్మృతివనం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్ స్మృతివనంలో
![అంబేడ్కర్కు విగ్రహాలు అవసరమా?](https://media.andhrajyothy.com/media/2024/20240215/ooo_3061c393f8.jpg)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
విజయవాడ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు విగ్రహాలు అవసరమా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని అంబేడ్కర్ స్మృతివనం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్ స్మృతివనంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.500 కోట్లు వెచ్చించిందని, ఈ నిధులతో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు. జెండాలు, దండలు, విగ్రహాలు వద్దని, రాజాఽ్యధికారం కావాలని అంబేడ్కర్ ఘోషించారని చెప్పారు. కేసీఆర్ దళిత ఓట్ల కోసం రూ.120 కోట్లతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇలా చేస్తే దళితులు, బీసీలు మోసపోతారా అని ప్రశ్నించారు. తాను ఇచ్చిన పిలుపుతోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించారన్నారు. చంద్రబాబు, జగన్, పవన్... మోదీకి తొత్తులని విమర్శించారు. ఈ తొత్తులతో ఉన్న ప్రజలు మూర్ఖులు, తెలివి లేని వారని వ్యాఖ్యానించారు. జగన్కు బుర్ర పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు బుర్ర ఉంటే కేజ్రీవాల్, స్టాలిన్, రేవంత్రెడ్డిలా పాలించేవాడని చెప్పారు. జగన్ ఓడిపోవడానికి సిద్ధం గానీ, అభివృద్ధికి సిద్ధం కాదంటున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఒక్కో కుటుంబంపై రూ.5కోట్ల భారం మోపాడని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్పై దాడి దారుణం
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు చేసిన దాడిని పాల్ తీవ్రంగా ఖండించారు. సభల్లో జగన్ చొక్కాలు మడతపెట్టండని పిలుపును ఇవ్వడం దీనికే సంకేతమా అని ప్రశ్నించారు. ఆయన పిలుపు ఇవ్వగానే వైసీపీ కార్యకర్తలు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు.