ఆథ్యాత్మిక ముసుగులో రాజకీయ ప్రచారం
ABN , Publish Date - Mar 02 , 2024 | 11:23 PM
ఇస్లాం మతపరమైన బోధనలను చేసే పీస్ మెసేజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజ్ ఉర్ రెహమాన్ ఆథ్యాత్మిక ముసుగులో రాజకీయ ప్రచార సభలు నిర్వహించడం సబబు కాదని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్ అన్నారు.
ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్
ఆదోని టౌన్, మార్చి 2: ఇస్లాం మతపరమైన బోధనలను చేసే పీస్ మెసేజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజ్ ఉర్ రెహమాన్ ఆథ్యాత్మిక ముసుగులో రాజకీయ ప్రచార సభలు నిర్వహించడం సబబు కాదని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇటీవల పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, పెద్దకూరపాడు, గురజాల నియోజకవర్గాలలో బ్రదర్ సిరాజ్ ఏర్పాటు చేసిన ముస్లిం సభలలో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడిన అనంతరం వైసీపీ నాయకులతో మాట్లాడించడం, వైసీపీకే ఓటు వేయాలని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయనకు వైసీపీ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే, పార్టీ కండువా వేసుకొని వైసీపీ నాయకుడిగా చలామణి కావడం ఉత్తమమని హితవు పలికారు. ముస్లింలను మతనభల కోసం ఆహ్వానించి వారికి వైసీపీ నాయకుల సంభాషణ వినిపించడం, ముస్లింలను మోసం చేయడమేనని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆదోని పట్టణంలో 4వ తేదీన బ్రదర్ సిరాజ్ సమావేశం ఏర్పాటు చేసారని, ముస్లిం మత సభల నుంచి రాజకీయాలను దూరంగా ఉంచడం ఎంతో అవసరమని, ఇక మీదట ఇలా జరగకుండా చూడాలని ఆయన సూచించారు.