మార్పు కోరుకుంటున్న ఏపీ ప్రజలు
ABN , Publish Date - Jan 30 , 2024 | 02:47 AM
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమయ్యారు’ అని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
![మార్పు కోరుకుంటున్న ఏపీ ప్రజలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/bb_db4cef9b45.jpg)
‘విగ్రహ ప్రతిష’్ఠ వారి మనసుల్ని తాకింది: పురందేశ్వరి
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమయ్యారు’ అని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో సోమవారం పార్టీ సంయోజక్లు(సమన్వయ కర్త), ఇన్చార్జిలు, విస్తారక్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోన్న వైసీపీ తీరుతో రాష్ట్ర భవిష్యత్తు రివర్స్ అయింది. దేశంలో పదేళ్లుగా అవినీతిలేని, అభివృద్ధి పాలన అందిస్తోన్న మోదీ ప్రభుత్వం మూడోసారి విజయ ఢంకా మోగించబోతోంది. దేశ ప్రగతి, బాల రాముని విగ్రహ ప్రతిష్ఠతో ప్రజల మనసుల్ని తాకడమే దానికి ప్రధాన కారణం. రాష్ట్రమంతటా ఎన్నికల వాతావరణం నెలకొంది.ఊ ఫిబ్రవరి 1న 25 పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాలు స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాలి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరాలి. రాష్ట్రంలో పొత్తుల విషయం అధిష్ఠానం చూసుకొంటుంది. ఫిబ్రవరి 9 నుంచి పల్లెకు వెళ్లి ప్రచారం కార్యక్రమం ద్వారా ఓటర్ల ఆశీర్వాదం కోరడమే మనందరి ధ్యేయంగా కావాలి’ అని పురందేశ్వరి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.