Share News

పెద్దిరెడ్డి చెప్పారని కట్టబెట్టారు!

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:28 AM

వైసీపీ అధికారంలో లేకపోయినా.. మంత్రి పదవిలో లేకపోయినా.. అమరావతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తోంది.

పెద్దిరెడ్డి చెప్పారని కట్టబెట్టారు!

ఆయన సన్నిహితుల సంస్థకే కాంట్రాక్టు.. అడ్డగోలుగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ టెండర్లు

15% లెస్‌కు వేసిన బిడ్డర్‌కు రిక్తహస్తం.. 8.5ు లెస్‌కు వేసిన సంస్థకు అప్పగింత

అదీ నకిలీ సర్టిఫికెట్‌తో.. అమరావతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌లో మాజీ మంత్రి హవా

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

వైసీపీ అధికారంలో లేకపోయినా.. మంత్రి పదవిలో లేకపోయినా.. అమరావతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తోంది. ఇటీవల ఈ కార్పొరేషన్‌ పిలిచిన టెండర్లలో పెద్దిరెడ్డి సన్నిహితులకు చెందిన సంస్థకు అర్హత లేకపోయినా కాంట్రాక్టును కట్టబెటట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ఈ-హెల్త్‌ సెంటర్లలో సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఐదేళ్లు వాటిని నిర్వహించేందుకు సుమారు రూ.2.47 కోట్లతో ఈ ఏడాది అక్టోబరులో టెండర్లు పిలిచారు. అయితే పెద్దిరెడ్డి చెప్పారంటూ అర్హత లేని కాంట్రాక్టర్‌కు ఆ టెండరును అప్పగించారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టమ్‌ల ఏర్పాటుకు అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పిలిచిన టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయి. నవంబరు 3న గుంటూరుకు చెందిన కియాన్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇండస్ట్రీ్‌సకు టెండరు కట్టబెట్టారు. పెద్దిరెడ్డికి సన్నిహితుడి సంస్థ కావడమే అర్హతగా వారికి టెండరు ఖరారు చేయడం గమనార్హం. టెండరులో పాల్గొన్న ఇషాన్‌ ఎనర్జీ సంస్థ 15శాతం తక్కువకు బిడ్‌ దాఖలు చేసింది.

తద్వారా ప్రభుత్వానికి రూ.37లక్షలు ఆదా అవుతాయి. కియా న్‌ ప్రాజెక్ట్స్‌. మాత్రం 8.5 శాతం తక్కువకు టెండరు వేయడం గమనార్హం. తద్వారా ప్రభుత్వానికి ఆదా అయ్యేది రూ.19.80 లక్షలే. టెండరులో పాల్గొనేందుకు గతంలో ప్రభుత్వ ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కియాన్‌ ప్రాజెక్ట్స్‌కు ఈ అనుభవం లేదు. కానీ అనుభవం ఉందంటూ ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నుంచి ఆ సంస్థ సర్టిఫికెట్‌ పొందింది. పుంగనూరులోని సమ్మర్‌ స్టోరేజీ ప్లాంటు వద్ద ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఈ సర్టిఫికెట్‌ను పొందారు. 2023 నవంబరు 17న ఈ పని దక్కించుకున్నట్లు, 2024 జనవరి నెలాఖరుకు పని పూర్తిచేసినట్లు అందు లో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక మెగావాట్‌ ప్లాంట్‌ను రెండున్నర నెలల్లో పూర్తిచేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సర్టిఫికెట్‌ ఇచ్చేనాటికి అసలు పనే పూర్తికాలేదని కేవలం పెద్దిరెడ్డి ఒత్తిడితోనే అధికారులు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇషాన్‌ ఎనర్జీ గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసిన అనుభవం సర్టిఫికెట్‌ను సమర్పించగా దాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.

Updated Date - Nov 13 , 2024 | 05:28 AM