‘పట్ట’భద్రులదే తొలి పట్టం
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:09 AM
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఏడాది క్రితమే తేలిపోయింది. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై పట్టభద్రులు స్పష్టత ఇచ్చేశారు.
![‘పట్ట’భద్రులదే తొలి పట్టం](https://media.andhrajyothy.com/media/2024/20240604/ap_logo_4a1d5ffb12.jpg)
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఏడాది క్రితమే తేలిపోయింది. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై పట్టభద్రులు స్పష్టత ఇచ్చేశారు. 108 అసెంబ్లీ స్థానాల పరిధిలో నిర్వహించిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతోనే వైసీపీకి ప్రతికూల వాతావరణం ఉందనే సంకేతాలు మొదలయ్యాయి. ఏకంగా సీఎం జగన్ సొంత జిల్లాలో సైతం పట్టభద్రులు వైసీపీని ఓడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. మొత్తం మూడు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా... తూర్పు రాయలసీమలో 34,110 ఓట్లు, ఉత్తరాంధ్రలో 34,936 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. చివరికి కడప జిల్లా ఉన్న పశ్చిమ రాయలసీమలోనూ గెలవడం టీడీపీలో ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. అప్పుడే ఓటమి దిశగా వైసీపీ పయనం మొదలైందని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన వైసీపీ పెద్దలు... వ్యతిరేకత లేదనే కోణంలో సమర్థించుకున్నారు. చదువుకున్న పట్టభద్రులు తమ ఓటర్లు కాదని, అసలు చదువుకున్నోళ్లు తమ పార్టీకి ఓట్లు వేయరంటూ విచిత్రమైన లాజిక్తో బుకాయించారు. ఎమ్మెల్సీ ఫలితాల అనుభవంతో తప్పులు సరిదిద్దుకుని ఉంటే ఇంతటి ఘోరపరాజయం చవిచూడాల్సిన దుస్థితి వైసీపీకి తప్పేది. ఆ ఎన్నికల ఫలితంతోనే వైసీపీ కోటకు బీటలువారాయని అధికార పార్టీలో చాలామంది నేతలకు అర్థమైనా పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోయారు.