పేర్లతో పరేషాన్!
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:21 AM
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్.. పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు
పలు నియోజకవర్గాల్లో కూడా
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో దాదాపు ఆయా అభ్యర్థుల పేర్లే ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఒకింత ఇబ్బందిగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. ఇదేస్థానం నుంచి కోనేటి పవన్ కల్యాణ్, కనుమూరి పవన్ కల్యాణ్ నామినేషన్లు వేశారు. దీంతో ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది.
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ వేయగా, దాదాపు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి వల్లభనేని మోహన్ శ్రీకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
తిరువూరు(ఎస్సీ)లో టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. దాదాపు ఇదే పేరుతో ఉన్న కొలికపోగు శ్రీను అనే వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ వేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదే పేరుతో ఉన్న బోయిన బుద్ధ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.
గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వేశారు. అదే పేరుతో ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.